దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది.
2019, నవంబర్ 27న జరిగిన దిశ అత్యా, హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్కు 50మీటర్ల దూరంలో నిందితులు ఓ యువతిని అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని తమ లారీలో షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించారు.
అయితే నిందితులను 2019, డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, అందుకే కాల్పులు జరిపినట్లు అప్పటి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్కౌంటర్లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ కోసం ఆర్నెళ్ల గడువు విధించింది.
త్రిసభ్య కమిషన్ విచారణ ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించిందిజ సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ… కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. విచారణలో భాగంగా దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ వివరాలు రాబట్టింది. అప్పటి కమిషనర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వున్న సజ్జనార్ కూడా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు… పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా సాగుతూనే వుంది. అయితే ఈ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన హైకోర్ట్ వాటిని కొట్టివేసింది. ఈ కమిషన్ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
