మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకుంది మొదటి భార్య. కొడుకు, కూతురుతో కలిసి ఘాతుకానికి పాల్పడింది. పైగా ఆ సామూహిక హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగలేదు.. ఆ మాజీ ఇల్లాలు.. భర్త పోయాడని తెలిసి గుండెలు బాదుకుంటూ డ్రామా రక్తి కట్టించింది. కానీ పోలీసులు దర్యాప్తులో అమ్మగారి బాగోతం అంతా వెలుగు చూసింది. ఆమె కపట నాటకాన్ని బయట పెట్టిన పోలీసులు.. కటకటాల్లోకి నెట్టారు. రాజస్తాన్లోని అజ్మీర్లో ఈ ఖతర్నాక్ వైఫ్ బాగోతం వెలుగు చూసింది.
రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలోని హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తొలుత పోలీసులు.. స్థానికుల తరహాలోనే దీన్ని ఓ ప్రమాదంగానే భావించారు. కానీ వారి దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పొలాల్లో కత్తి గాట్లతో మరో మృతదేహం పడి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండో భార్య, మేనకోడలుగా గుర్తించారు. ఐతే పోలీసుల దర్యాప్తు క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
రామ్ సింగ్, సునీతకు 2005లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే సునీతకు ఇష్టం లేకుండా రామ్సింగ్.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. హత్య జరిగే కంటే ఒక రోజు ముందు కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో కుమార్తె సరిత, మైనర్ కుమారుడితో కలిసి రామ్సింగ్ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ చేసింది.
తన ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని భావించిన సునీత.. ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్సింగ్పై కొడుకు, కూతురి సాయంతో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత, ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్టు చేశారు.
పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించింది సునీత. తనకు ఏమీ తెలియదనట్లు చెప్పుకొచ్చింది. పైగా భర్త చనిపోయాడని ఎక్కడలేని బాధతో గుండెలు బాదుకుంటూ రోదించింది. పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది. పాపం ఆ పోలీసులు కూడా నిజమోనని నమ్మారు. సీన్ కట్ చేస్తే..పలు సాంకేతిక ఆధారాల ద్వారా హత్య చేసింది ఆమేనని దర్యాప్తులో గుర్తించారు.
