NTV Telugu Site icon

Crime: నకిలీ వితంతు సర్టిఫికెట్లతో గవర్నమెంట్ జాబ్ కొట్టేసిన అక్కాచెల్లెళ్లు..

Rajasthan

Rajasthan

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలు మోసాల హద్దులు దాటుతున్నారు. కొందరు పేపర్ లీక్ చేసి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తే.. మరి కొందరు సాల్వ్డ్ పేపర్ల కోసం రూ. లక్షలు వెచ్చించి అడ్డంగా బుక్ అవుతారు. మరికొందరు నకిలీ అభ్యర్థులుగా నటిస్తూ లేదా కాపీ కొట్టి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన మోసం చాలా విచిత్రంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ప్రకారం.. కొందరు అమ్మాయిలు నకిలీ వితంతు సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు అలాంటి అమ్మాయిలకు శిక్ష పడబోతోంది.

ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు నకిలీ వితంతు సర్టిఫికెట్లతో..
ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన దోపిడీ కొత్తగా ఏర్పడిన రాజస్థాన్ రాష్ట్రం బీవర్ జిల్లాలో వెలుగు చూసింది. అక్కాచెల్లెళ్లిద్దరూ నకిలీ వితంతు సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అక్క సునీత తన అక్క బావమరిది మరణ ధృవీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం సంపాదించింది. తనను తాను వితంతువుగా ప్రకటించుకుంది. చెల్లెలు రేఖ తన గ్రామానికి చెందిన మదన్ అనే అబ్బాయి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించి వితంతు కోటా కింద ఉద్యోగం సంపాదించింది. ఇద్దరూ ఉపాధ్యాయులుగా మారారు. సునీత ఖర్లా ఖేడా బేవార్‌లోని ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తుండగా.. రేఖ రాజ్‌సమంద్ జిల్లా బద్నిలోని ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో పని చేస్తోంది.

2022 టీచర్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు..

2022 టీచర్ రిక్రూట్‌మెంట్‌లో సునీతా చౌహాన్, 2016-17 రిక్రూట్‌మెంట్‌లో రేఖ టీచర్‌గా మారినట్లు సర్టిఫికేట్ వెల్లడిస్తోంది. వీరిద్దరూ డెత్ సర్టిఫికెట్లు సమర్పించారు. వాటిలో మోసం జరిగినట్లు నిర్ధారణ అవుతోంది. సునీతా చౌహాన్ తన బావమరిది ఛగన్‌లాల్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించింది. ఛగన్‌లాల్‌కు వివాహమైంది. అతని భార్య బతికే ఉంది. ఛగన్‌లాల్ మరణించినట్లు అతడి భార్య ప్రమాద బీమా మొత్తాన్ని కూడా పొందింది. కానీ అతని మరణ ధృవీకరణ పత్రాన్ని సునీత వాడుకుంది. సునీత ఉదయపూర్‌లో నివసించే నిర్మల్ సింగ్‌ను 25 నవంబర్ 2020న వివాహం చేసుకుంది.

గ్రామానికి చెందిన వ్యక్తి డెత్‌ సర్టిఫికెట్‌తో చెల్లి ఇలా..
మరోవైపు, రేఖా చౌహాన్ తన గ్రామానికి చెందిన మదన్ సింగ్ మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించింది. పాలిలోని సోజత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదన్ సింగ్ మరణించాడు. మదన్ సింగ్ అవివాహితుడు కావడంతో ప్రమాదంలో మరణించిన తర్వాత మదన్ సింగ్ తల్లిదండ్రులు ప్రమాద బీమా మొత్తాన్ని పొందారు. పెళ్లికాని మదన్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని రేఖ ఉపయోగించుకుని టీచర్‌గా మారింది.

సునీత, రేఖ కుటుంబాలు బీజేపీ నేతలతో సన్నిహితం..
వీరిద్దరూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబాలు బీజేపీకి చెందినవే. కుటుంబ సభ్యులే రాజకీయాల్లో ఉన్నారని చెబుతున్నారు. వారి తల్లిదండ్రులు ఇద్దరూ సర్పంచ్‌లు. నవంబర్ 2020లో నిర్మల్ సింగ్‌తో సునీత వివాహం జరిగినప్పుడు, బీజేపీ ఎమ్మెల్యే శంకర్ సింగ్ రావత్ కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు సోదరీమణుల కుటుంబ కార్యక్రమాలకు బీజేపీ నేతలు హాజరవుతున్నారు.