Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్‌..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!

Pune Murder Case

Pune Murder Case

Pune Murder Twist : పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు… రెండు కుటుంబాల ఆశలు, భవిష్యత్తుపై నమ్మకం. కానీ అదే బంధం వెనుక దాగిన ఒక రహస్యం చివరకు ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలితీసుకుందని పోలీసులు చెబుతున్నారు. మొదట ప్రమాదంగా కనిపించిన ఘటన… ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ ముందే రచించిన హత్యా ప్రణాళికగా మారుతోంది. మహారాష్ట్రలోని పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక రహస్య ప్రేమ, నిశ్చితార్థం, కుటుంబాల మధ్య దాచిన నిజాలు, చివరకు కొండ అంచున జరిగిన విషాదం… ఈ కేసు ప్రతి మలుపులో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

మహారాష్ట్రకు చెందిన ధనిక వ్యాపార కుటుంబాలకు చెందిన కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబరులో ఘనంగా వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు కూడా ప్రారంభించాయి. బయటకు చూస్తే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేనట్టే కనిపించింది. తరచూ ఇద్దరూ కలిసి డిన్నర్లకు వెళ్లేవారని, సియా తమ కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా మాట్లాడేదని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం కేతన్‌ను ఎప్పుడూ కలవరపెడుతుండేదట. సియా ఫోన్ గంటల తరబడి ఎప్పుడూ బిజీగా ఉండేదని, దీనిపై ప్రశ్నిస్తే స్నేహితులతో మాట్లాడుతున్నానని ఆమె చెప్పేదని ఆయన వెల్లడించారు. కానీ తన కుమారుడికి ఆమె మరో వ్యక్తితో ప్రేమలో ఉందన్న విషయం అసలు తెలియదని తెలిపారు.

జూన్ 18న కేతన్, సియా కలిసి లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడి లోయలో కేతన్ పడిపోవడంతో తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించారు. అయితే దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ కథ పూర్తిగా మారిపోయింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, సియా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసేందుకు ముందుగానే ప్రణాళిక రచించింది. కేవలం అదే రోజు కాదు, అంతకుముందే పలుమార్లు ప్రయత్నాలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది.

మే 31న సియా, చేతన్ ఇద్దరూ లోహగడ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లాలని సియా ప్రయత్నించిందని, అయితే కేతన్ తల్లి అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెబుతున్నారు. అనంతరం జూన్ 14న కేతన్ అక్కడికి వెళ్లినప్పుడు కూడా కొండపై నుంచి తోసేందుకు ప్రయత్నించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని, ఏమైందని అడిగితే పాము నుంచి కాపాడేందుకు అలా చేశానని సియా చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చివరికి జూన్ 18న పుణెలోని ఒక కేఫ్‌లో సియా, చేతన్ కలుసుకుని హత్యకు తుది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం సియా కేతన్‌ను ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లగా, చేతన్ వెనుక నుంచి వారిని అనుసరించాడని గుర్తించారు. సరైన అవకాశం చూసి ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ చేతన్ హూడీ ధరించి కనిపించడం పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ ఆధారంగానే అతడిని గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు.

కేతన్ మరణం తర్వాత సియా ప్రవర్తనే కుటుంబ సభ్యుల్లో మొదటి అనుమానాలకు కారణమైంది. కేతన్ సోదరి సంజనా… అతడు ఎలా పడిపోయాడు, ఎప్పుడు జరిగింది, కొండ అంచుకు ఎందుకు వెళ్లాడు వంటి సాధారణ ప్రశ్నలు అడిగినా సియా సరైన సమాధానాలు చెప్పలేకపోయిందని విశాల్ అగర్వాల్ తెలిపారు. తమ కుమారుడు ఎప్పుడూ అలాంటి ప్రమాదకర అంచుల వద్ద నిలబడే వ్యక్తి కాదని, అప్పుడే కుటుంబానికి అనుమానాలు మొదలయ్యాయని చెప్పారు.

ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ వివాహం ఎవరి బలవంతంతోనూ జరగలేదని కేతన్ తండ్రి స్పష్టం చేశారు. సియాకు వేరే వ్యక్తితో ప్రేమ ఉంటే ముందే చెప్పి ఉంటే పెళ్లిని వెంటనే రద్దు చేసేవాళ్లమని అన్నారు. అవసరమైతే వాట్సాప్‌లో ఫొటోలు పంపినా సరే సంబంధాన్ని ముగించేవాళ్లమని, ఒకరి ప్రాణం తీయాల్సిన అవసరం అసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సియా తల్లిదండ్రులు, ఆమె అత్తకు ఈ ప్రేమ వ్యవహారం గురించి ముందే తెలిసి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ, దర్యాప్తులో అసలు కుట్ర మొత్తం బయటపడాలని కోరారు.

తన 26 ఏళ్ల కుమారుడిని చిన్న కారణం కోసం దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తున్న విశాల్ అగర్వాల్… ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంగా మొదలైన ఈ కేసు ఇప్పుడు ప్రేమ, మోసం, ముందస్తు ప్రణాళిక, హత్య ఆరోపణలు, కుటుంబాల వేదనలతో కూడిన సంచలన క్రైమ్ కథగా మారిపోయింది. ఇప్పుడు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో ఇంకా ఎలాంటి కొత్త నిజాలు బయటపడతాయన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.