Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్‌.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి

Up Road Accident

Up Road Accident

Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు కూలీలు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం గా గుర్తించారు. గాయపడిన నాగమణి, అరుణలను వెంటనే స్థానికులు మరియు పోలీసులు కలిసి కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కోసం బయలుదేరిన మహిళలు ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.