Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!

Digital Arrest Scam

Digital Arrest Scam

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్.. ఇదే పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధులను టార్గెట్ చేస్తూ..కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం వెలుగుచూసింది. కర్ణాటకలో ఓ వృద్దురాలిని మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా 24 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆరుగురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది.

డిజిటల్ అరెస్ట్ పేరుతో అతి పెద్ద సైబర్ నేరం జరిగింది. దీనికి కర్ణాటకలో ఓ వృద్ధురాలు.. భారీ ఎత్తున మూల్యం చెల్లించుకుంది.. కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులమంటూ నమ్మించి, 74 ఏళ్ల వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.24 కోట్లు దోచేశారు. కర్ణాటక స్టేట్ సైబర్ కమాండ్ యూనిట్ పోలీసులు ఈ ముఠా గుట్టురట్టు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన లక్ష్మి రామమూర్తి అనే 74 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. తాము సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులమంటూ ఆమెకు పరిచయం చేసుకున్నారు. ఆమె ఏదో పెద్ద నేరానికి పాల్పడిందని.. దర్యాప్తు జరుగుతోందని చెప్పి భయ పెట్టారు. అంతే కాదు.. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరించారు. ఎవరితో సంబంధాలు పెట్టుకోవద్దని హుకుం జారీ చేశారు. ఆమెను ఒక గదికే పరిమితం చేసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు.

ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 24 మధ్య రూ.24 కోట్లను బదిలీ
కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని బెదిరించారు సైబర్ దుండగులు. దీంతో భయపడిపోయిన ఆమె.. తన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో 26 విడతలుగా దాదాపు రూ.24 కోట్లను బదిలీ చేశారు. ఈ డబ్బు దేశవ్యాప్తంగా ఉన్న 10 వేర్వేరు బ్యాంకుల్లోని 23 మ్యూల్ అకౌంట్లలోకి చేరింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు బదిలీ అయిన మొదటి లేయర్ అకౌంట్లను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రూ.4 కోట్లకు పైగా నిధులను ఫ్రీజ్ చేయగా.. కోర్టు ఆర్డర్ల ద్వారా మరో రూ.1.46 కోట్లను రికవరీ చేశారు.

ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి.. వారి నుంచి 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దేశవ్యాప్త సైబర్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని కర్ణాటక పోలీసులు తెలిపారు. చట్టబద్ధమైన ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‍‌‌లైన్ వీడియో కాల్స్‌లో ఎవరినీ డిజిటల్ అరెస్ట్ చేయదని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.