హైదరాబాద్లో సంచలనం సృష్టించిన వక్ఫ్బోర్డు ప్యానెల్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూవివాదాలు, వక్ఫ్బోర్డు భూముల పరిరక్షణకు సంబంధించిన కోర్టు కేసులే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో బర్కత్పురాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతతో పాటు ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే తండ్రీకొడుకులతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నాంపల్లికి చెందిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ గత కొన్నేళ్లుగా వక్ఫ్బోర్డు భూముల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మలక్పేట్, లక్డీకాపూల్, మల్లేపల్లి ప్రాంతాల్లోని విలువైన వక్ఫ్ భూములకు సంబంధించిన కేసులను కోర్టులో వాదిస్తూ ఆక్రమణలను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే బర్కత్పురాకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చినట్లు విచారణలో తేలింది. తమ ఆధీనంలో ఉన్న భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, కేసులను వెనక్కి తీసుకోవాలని ఆ నేతతో పాటు ఆయన కుమారుడు మొయిజుద్దీన్పై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
అంతేకాకుండా, వక్ఫ్బోర్డులో కీలక పదవిలో ఉన్న ఆ రాజకీయ నేతను తప్పించే ప్రయత్నం కూడా మొయిజుద్దీన్ చేశారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. భూములతో పాటు పదవి కోల్పోతామనే భయంతోనే ఆయనపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసుల నుంచి వైదొలిగితే రూ.2 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. మల్లేపల్లి, లక్డీకాపూల్, మలక్పేట్ ప్రాంతాల భూములపై కేసులు వేయవద్దని.. బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోనని మొయిజుద్దీన్ స్పష్టం చేయడంతోనే హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ హత్యను అమలు చేసేందుకు తావూస్, మునీర్ అనే వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినట్లు విచారణలో తేలింది. వీరు నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును సంప్రదించి సుపారీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం రూ.15 లక్షల సుపారీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం కవాడిగూడకు చెందిన సింగూరి అభిజిత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్కు హత్య బాధ్యతలు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.
ముందస్తు పథకం ప్రకారం కారు కొనుగోలు చేసి.. పలుమార్లు రెక్కీ నిర్వహించారు నిందితులు. మే 23న రెడ్హిల్స్ శాంతినగర్లో మొయిజుద్దీన్ను టార్గెట్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజిత్.. ఆ రోజు స్కార్పియో వాహనం నడిపినట్లు తెలుస్తోంది. అతడితో పాటు మణిదీప్, వినయ్ కారులో ఉన్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగా హత్య సమయంలో మొయిజుద్దీన్ ఎక్కబోయిన ఇతర వాహనాలకు ఎలాంటి నష్టం కలగలేదని అధికారులు తెలిపారు.
హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనానికి నెంబర్ ప్లేట్ లేకపోయినా.. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు సేకరించి విశ్లేషించారు. ఈ ఆధారాలతో అభిజిత్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న తావూస్, మునీర్, కిషన్ సింగ్ కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. మరోవైపు హత్యకు ఉపయోగించిన కారును రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని బైపాస్ రోడ్డు పక్కన నిందితులు వదిలేశారు. ఆ కారును గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. అభిజిత్, వినయ్ను వెంట తీసుకెళ్లి ఘటన జరిగిన తీరును కారులో పునర్నిర్మించారు. హత్య జరిగిన సమయంలో కారు ఎంత వేగంగా వెళ్లిందనే అంశాన్ని కూడా పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేత పాత్రపై ఆధారాలు లభించడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయనను సికింద్రాబాద్లోని కార్యాలయానికి పిలిపించి గంటల తరబడి విచారించినట్లు తెలిసింది. మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆ నేత, తరువాత విచారణలో కొన్ని విషయాలు అంగీకరించినట్లు సమాచారం. ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగానే తావూస్, మునీర్ పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్న అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
