Site icon NTV Telugu

Hyderabad Hawala Racket: పాతబస్తీ అడ్డాగా హవాలా ‘చీకటి’ దందా.. కోడ్ భాషలో కోట్లు మార్పిడి!

Hyderabad Hawala Racket

Hyderabad Hawala Racket

Hyderabad Hawala Racket: హైదరాబాద్‌లో హవాలా మార్కెట్ యథేచ్చగా సాగుతోందా? చాప కింద నీరులా హవాలా కేటుగాళ్లు నెట్‌వర్క్‌ను విస్తరించారా? యస్.. దీనికి అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల కన్నుగప్పి హవాలా ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ముగ్గురు యువకులు పట్టుబడడంతో మరోసారి హవాలా మార్కెట్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడో విదేశాల్లో ఉండడం లేదా.. అకౌంట్లో చూపని మనీని తాము అనుకున్న వారికి చేర్చేందుకు హవాలా తరహా దందా ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. ఐతే ఇది పూర్తిగా అక్రమ దందా. కానీ ఈ దందాకు హైదరాబాద్ పాతబస్తీ అడ్డాగా మారింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఈ హవాలా కేటుగాళ్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేయలేకపోతున్నారు.

READ ALSO: Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్‌’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!

ఈ హవాలా దందాలో భౌతికంగా డబ్బు సరిహద్దులు దాటదు. పంపేవారు తమ దేశంలోని హవాలా ఏజెంట్‌కు నగదు ఇచ్చి, ఒక కోడ్ లేదా కరెన్సీ నోటు నంబర్‌ను తీసుకుంటారు. ఆ నంబర్, వివరాలను అవతలి దేశంలోని ఏజెంట్‌కు చెప్పి.. డబ్బును గ్రహీతకు అందజేస్తారు. ఇది పూర్తిగా ఇద్దరు హవాలాదార్ల మధ్య నమ్మకంపై పనిచేస్తుంది. భారతదేశంలో హవాలా లావాదేవీలు చట్టవిరుద్ధం. ముఖ్యంగా మనీలాండరింగ్, పన్ను ఎగవేత మాత్రమే కాకుండా ఉగ్రవాద నిధుల కోసం హవాలా దందాను ఉపయోగిస్తున్నారు. కాబట్టి పోలీసులు దీనిపై గట్టి నిఘా పెట్టారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గోషామహల్ గ్యాన్ బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేశారు. వారివద్ద ఉన్న సంచులలో 77 లక్షల నగదు బయటపడింది..! అంతే కాదు వారివద్ద సగం చించి వేసిన ఒక పది రూపాయల నోటు.. మరో ఇరవై రూపాయల నోటు కనిపించింది.! డబ్బుపై ఆరా తీయగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటు భయం భయంగా తడబడుతున్న వారి తీరు చూసి పోలీసులు మరింత అనుమానించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

పోలీసులు నగదును లెక్కించగా రూ.76 లక్షల 87 వేల 650లు ఉన్నట్లు తేలింది. నగదును పంచ్‌ ఛిట్‌లతో సీల్‌ చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భధ్రంగా ఉంచారు. దర్యాప్తు చేయగా బేగంబజార్‌కు చెందిన సందీప్‌ కల్పేశ్‌, కుపారామ్‌, కార్తీక్‌ల సూచనల మేరకు లెక్కల్లో చూపని డబ్బును సేకరించి హైదరాబాద్‌లోని అఫ్టల్‌గంజ్‌కు చెందిన ఠాగరంకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. నగదును తరలిస్తున్న నిందితులను జోటార్మ్‌, గణపతి రామ్‌, రాకేశ్‌ దేవాసిలుగా గుర్తించారు. తదుపరి చర్యల కోసం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ బేగం బజార్…ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడ దశాబ్దాలుగా హోల్ సేల్ బిజినెస్ చేస్తున్నారు.. గోషామహల్ కు మినీ ఇండియాగా పేరుంది.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలలో హోల్ సేల్ మార్కెట్లు ఉన్నచోట హవాలా బ్లాక్ మనీ దందా కొనసాగుతున్నట్లుగా అందరికీ తెలుసు. కానీ దందా నడిపేవాళ్లని పెట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది. హోల్ సేల్ మార్కెట్లలో వాహనాల్లో పెద్దమొత్తాల్లో సరుకులు రవాణా చేస్తుంటారు కాబట్టి ఏ వాహనంలో ఏ సరుకు సంచులలో డబ్బు ఉందో..పక్కా సమాచారం ఉంటే తప్ప బయటకి తెలియడం కష్టం.

READ ALSO: AP Crime: నా కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు.. కాపాడండి.. హోంమంత్రికి మహిళ విజ్ఞప్తి..

Exit mobile version