CA Student Suspicious Death: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సీఏ చదువుతున్న విద్యార్థి అద్దెకు ఉంటున్న గదిలోనే వేలాడుతూ శవమై కనిపించాడు. కానీ అతను వేసుకున్న టీ షర్ట్పై రక్తపు మరకలు ఉండటం.. యువకుడు మృతిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఆ యువకుడి పేరు జనార్ధన్. కర్నూలు జిల్లాకు చెందిన జనార్థన్.. సీఎ బ్యాక్ లాగ్స్ ఉండటంతో హైదరాబాద్కు వచ్చాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్లో మరో ఇద్దరితో కలిసి అద్దెకు ఉంటున్నాడు.
తోటి రూమ్ మేట్స్ జాబ్స్ చేసుకుంటుండగా.. జనార్థన్ బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయాడానికి ప్రిపేర్ అవుతున్నాడు. రోజు మాదిరిగానే తమ రూమ్లో వంట చేసుకొని జనార్థన్కు చెప్పి గదికి మరో వైపు నుంచి తాళం వేసుకొని వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో రూమ్ వద్దకు వచ్చిన ఇద్దరు స్నేహితులు.. గదికి తాళం తీసి చూడగా.. ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. జనార్థన్ ధరించిన టీషర్ట్కు రక్తం ఉండటం.. నోట్లోంచి తీవ్ర రక్త స్రావం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
జనార్థన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు స్నేహితులు. దీంతో హుటాహుటిన కర్నూల్ నుంచి బయల్దేరి వచ్చిన కుటుంబ సభ్యులు.. జనార్థన్ మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఉరేసుకుంటే నోట్లోంచి రక్తస్రావం ఎందుకు అవుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ డెడ్బాడీని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు జనార్థన్ డెడ్బాడీని అప్పగించారు పోలీసులు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.
