Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

B.tech Student Suicide

B.tech Student Suicide

Student Suicide: చదివిన చదువుకు తగిన గుర్తింపు లభించలేదన్న ఆవేదన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లావణ్య (28) అనే యువతి బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువు చదివిన తనకు మంచి ఉద్యోగం వస్తుందని, కుటుంబాన్ని ఆదుకోవచ్చని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైల్వేతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం మాత్రం ఆమెకు దక్కలేదు.

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని..
చదువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగిగానే ఉండిపోవడంతో లావణ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే తీవ్ర గాయాలవ్వడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఒక చదువుకున్న యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో దొమ్మర నంద్యాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.