Girl Elopes With Lover: బీహార్లో రోహ్తాజ్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఇంట్లో ప్రతీ చోట రక్తం కనిపించడంతో కుటుంబీకులు ఏదో దారుణం జరిగిందని అనుమానించారు. అయితే, పోలీసుల రంగ ప్రవేశంతో 15 రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. ఇంట్లో ఉన్న రక్తం అసలు మనిషిది కాదని, కోడి రక్తమని తేలింది. మైనర్ బాలిక తన తెలివితో అందర్ని బురిడీ కొట్టిద్దామని చూసింది. తన లవర్తో పారిపోయేందుకు ఇలా ప్లాన్ చేసింది.
ఇంద్రపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బధిహా గ్రామానికి చెందిన ఒక నివాసి, ఏప్రిల్ 30వ తేదీ రాత్రి తన మైనర్ కుమార్తె ఇంటి నుండి అకస్మాత్తుగా అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లంతా రక్తం మరకలు ఉండటంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ముందగా పెరటిలో బ్లడ్ పడి ఉండటంతో కిడ్నాప్ లేదా హత్య జరిగిందని ముందుగా పోలీసులు భావించారు, విచారణ ముమ్మరం చేశారు. బాలిక కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ కాల్ వివరాలు, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసుల విచారణ సాగింది.
చివరకు బాలిక తన లవర్తో కలిసి ఇళ్లు వదిలి పారిపోయిందని తేలింది. మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో తన ప్రియుడు మాయాంక్ కుమార్తో కలిసి ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు బీహార్ తీసుకువచ్చారు. నిందితుడు మయాంక్ కుమార్ను అరెస్ట్ చేశారు. బాలిక, మయాంక్ సుమారు 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. కుటుంబం వ్యతిరేకిస్తుందనే భయంతో ఇద్దరూ పారిపోయారు. ప్రణాళికలో భాగంగా ఒక కోడిని చంపి రక్తాన్ని ఇల్లంతా చల్లినట్లు తేలింది.
