Bihar Crime: వివాహేతర సంబంధం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో బీహార్లో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. భర్తే తమ ప్రేమకు అడ్డుగా మారాడని భావించిన ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో నగ్న మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఇన్వెస్టిగేష్ లో వారి పథకం నిలవలేదు. ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం, బీహార్లోని రోహ్తాస్ జిల్లా కారకత్ ప్రాంతానికి చెందిన వీరేంద్ర సింగ్ తన భార్య మమతా దేవి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అరవింద్ కుమార్ సింగ్ వీరేంద్రకు స్నేహితుడు. ఆ స్నేహం కారణంగా అతడు తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఆ రాకపోకల మధ్య మమతా, అరవింద్ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది.
అయితే భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. జూలై 19 రాత్రి నిద్రిస్తున్న వీరేంద్రపై పదునైన గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు బట్టలు విప్పేసి నగ్నంగా కాలువలో పడేశారు. శరీరం ప్రవాహంలో కొట్టుకుపోయి ఎవరికీ గుర్తుపట్టలేని స్థితికి చేరుతుందని వాళ్ళు భావించారు.
అయితే వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టింది. రోహ్తాస్ ప్రాంతం నుంచి కొట్టుకువచ్చిన మృతదేహం బక్సర్ జిల్లాలోని దుమ్రాన్ సమీప కల్మాన్పూర్ ప్రాంతంలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులను పిలిపించగా, అది వీరేంద్ర సింగ్దేనని నిర్ధారించారు.
మృతుడి సోదరుడు జితేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోన్ టవర్ లొకేషన్లు, కాల్ డీటెయిల్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించిన అనంతరం మమతా దేవి, అరవింద్ కుమార్ సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరూ హత్యకు సంబంధించిన విషయాలను అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. తమ ప్రేమ వ్యవహారమే ఈ నేరానికి కారణమైందని వాళ్ళు తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, కుటుంబ బంధాల్లో విశ్వాసం దెబ్బతింటే పరిణామాలు ఎంత ఘోరంగా మారవచ్చో మరోసారి గుర్తు చేసింది. పోలీసులు హత్యకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ, పూర్తి వివరాలను వెలికితీసే పనిలో ఉన్నారు.

