డబ్బు కోసం మనిషి చేయని ప్రయత్నమంటూ లేదు.. అదే సమయంలో మనిషి ఎంతకైనా దిగజారుతున్నాడు.. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నాడు. ఇందులో మన తన తేడా కూడా ఉండడం లేదు.. పాపం పుణ్యాలు అసలే లేవు. తాను అడిగిన డబ్బు ఇవ్వలేదని అనంతపురం జిల్లాలో ఓ కసాయి చేసిన పని చూస్తే.. ఆ దుర్మార్గున్ని ఏం చేసినా పాపం లేదని ప్రతి ఒక్కరూ అంటారు. మనుషులంటే ఇలా కూడా ఉంటారా? అనే విధంగా జరిగిందీ ఆ సంఘటన. అసలేం జరిగింది? ఆ కసాయి చేసిన పనేంటి..? ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడు..?
అది అనంతపురం జిల్లా యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాల. అక్కడ హేమచంద్ర అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. రోజూలాగానే పాఠశాల ముగియగానే హేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు స్కూలు సిబ్బంది. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుని ఓ వ్యక్తి వేచి ఉన్నాడు. బస్సు ముందుకెళ్లగానే.. నడుచుకుంటూ వస్తున్న హేమచంద్రను ముసుగు వ్యక్తి అవహరించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు…
సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికెళ్లాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు… స్కూలు బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. మునుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా ద్విచక్రవాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులకు కూడా సీసీ ఫుటేజ్ చూపించి సమాచారం సేకరించారు. అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ రోహిత్ కుమార్తో పాటు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కుందనకోట గ్రామంలో కిడ్నాప్నకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని ఎట్టకేలకు గుర్తించారు.
ఆ తర్వాత కిడ్నాప్కు పాల్పడిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు. దీంతో అంతా విస్తుపోయారు. ఇది చేసింది ఎవరంటే.. ఆ బాలుని స్వయాన బావ సర్వేష్. అసలు ఏడేళ్ల బాలున్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అది కూడా సొంత బావ ఎందుకిలాంటి పని చేశాడు? కిడ్నాప్ అయిన బాలుడు ఏమయ్యాడన్నది మిస్టరీగా మారింది.
యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె లలితకు సర్వేష్తో వివాహమైంది. అయితే గత కొన్ని రోజులుగా సర్వేష్ తనకు డబ్బు కావాలని భార్య లలితను వేధించే వాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేసే వాడు. తన వద్ద లేవని గోవిందు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాను ఎంత అడిగినా డబ్బు ఇవ్వలేదని మామపై కక్ష పెంచుకున్నాడు. అతనికి ఉన్న ముద్దుల కొడుకు హేమచంద్రపై అతని కన్ను పడింది. హేమచంద్రను ఏమైనా చేస్తే కానీ నా కోపం చల్లారదనుకున్నాడు. అందుకే పథకం ప్రకారం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా హేమచంద్రను కిడ్నాప్ చేశాడు.
అసలు హేమచంద్రను కిడ్నాప్ చేశాడు.. సరే మరి ఎక్కడ దాచాడంటే.. ఇక్కడే చాలా దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. హేమచంద్రను కిడ్నాప్ చేసిన తర్వాత కుందనకోట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక తాడును తీసుకుని అత్యంత కర్కశంగా బాలుని గొంతుకు బిగించాడు. బండరాళ్లతో కొట్టి చంపేశాడు. అక్కడే ఆ పసివాడు ప్రాణాలు వదిలాడు. ఆతర్వాత బాలుడి మృతదేహాన్ని బండల మధ్యలో పడవేశాడు. పోలీసుల విచారణలో సర్వేష్ నిజం ఒప్పుకోవడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కేవలం డబ్బు ఇవ్వలేదన్న కారణంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ కసాయిని ఏం చేయాలి? ప్రతి ఒక్కరి నోట ఇలాంటి వారిని.. అంతే కర్కశంగా శిక్షించాలంటున్నారు. కానీ బాలుని తల్లిదండ్రులు మాత్రం మౌనంగా రోదిస్తున్నారు. డబ్బుపై ఆశ ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
