ప్రస్తుతం ప్రపంచం ఏఐ యుగంలో నడుస్తోంది. ఇప్పుడు అన్ని ఫోన్లు కృత్రిమ మేధస్సుతో చక్కబెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ మొబైల్ కూడా వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ స్మార్ట్ఫోన్ను చైనా విడుదల చేసింది. 2023లో మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు స్థాపించిన చైనీస్ ఏఐ స్టార్టప్ స్టెప్ఫన్.. ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఏఐ స్మార్ట్ఫోన్ అయిన స్టెప్ఎక్స్ నియోను విడుదల చేసింది. ఈ ఫోన్లో స్టెప్ అము అనే అంతర్నిర్మిత ఏఐ ఏజెంట్ ఉంది. ఇది స్టెప్ఫన్ సొంత ఓఎస్ అయిన స్టెప్ ఏఓఎస్పై పూర్తిస్థాయి పనులను స్వయంగా నిర్వహిస్తుంది. స్టెప్ అము నెట్వర్క్ కనెక్టివిటీ లేకుండా కూడా పనిచేయగలదు. ఒకే సహజ-భాషా అభ్యర్థన ఆధారంగా బహుళ-దశల పనులను చేయగలదు. ఒక్క మాట చెబితే చాలు.. అన్ని పనులు అదే చేస్తుంది.
వినియోగదారుల తరఫున స్వయంగా పనులు పూర్తి చేసే సామర్థ్యంతో ఈ ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. స్టెప్ఫన్ అభివృద్ధి చేసిన సొంత ఏఐ మోడల్, ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో ‘స్టెప్ అమూ (Step Amoo)’ అనే ఏఐ అసిస్టెంట్ను అందించారు. వినియోగదారు కేవలం వాయిస్ కమాండ్ ఇవ్వగానే వివిధ యాప్ల మధ్య మారుతూ బహుళ దశల్లో ఉండే పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. దీంతో యాప్లను విడివిడిగా ఓపెన్ చేసి పని చేయాల్సిన అవసరం ఉండదని కంపెనీ వెల్లడించింది.
32 భాషల్లో లైవ్ అనువాదం
స్టెప్ఎక్స్ నియోలో 32 భాషలకు లైవ్ ట్రాన్స్లేషన్ సదుపాయం ఉంది. విదేశీ ప్రయాణాల సమయంలో రియల్టైమ్లో భాషలను అనువదించడంతో పాటు ప్రయాణ ప్రణాళికను కూడా ఏఐ అసిస్టెంట్ స్వయంగా సిద్ధం చేస్తుంది. విమాన టికెట్లు బుక్ చేయడం, హోటల్ రిజర్వేషన్, పూర్తి ట్రావెల్ ఇటినరీ రూపొందించడం వంటి పనులను యాప్లు మార్చాల్సిన అవసరం లేకుండానే నిర్వహించగలదు.
ఇంటర్నెట్ లేకున్నా కొన్ని సేవలు
వినియోగదారు ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారో నేర్చుకునే సామర్థ్యం ఈ ఏఐకి ఉంది. అంతేకాకుండా ఇంటర్నెట్ లేకున్నా వీసా గడువు గుర్తుచేయడం, కస్టమ్స్కు సంబంధించిన సమాచారం అందించడం వంటి కొన్ని సేవలను కూడా అందించగలదని కంపెనీ తెలిపింది. స్టెప్ఫన్ సంస్థ అలీపే (Alipay), డిడి (Didi), సీట్రిప్ (Ctrip) వంటి ప్రముఖ డిజిటల్ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో చెల్లింపులు, క్యాబ్ బుకింగ్, ప్రయాణ సేవలను ఒకే ఏఐ అసిస్టెంట్ ద్వారా మరింత సులభంగా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఏజెంటిక్ ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ స్మార్ట్ఫోన్ భవిష్యత్ మొబైల్ అనుభవాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

