SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..

Sebi

Sebi

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) రంగంలో పెట్టుబడిదారులకు, పరిశ్రమకు పెద్ద ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టతను ఇచ్చింది. నాన్-డిస్క్రిషనరీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ND-PMS) కింద పెట్టుబడి పెట్టే క్లయింట్లు, రుణాలు పొందేందుకు తమ షేర్లను తాకట్టు పెట్టుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించకుండానే అత్యవసర నిధులను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. రిజిస్టర్డ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అయిన ‘జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సెబీ ఈ వివరణ ఇచ్చింది. PMS ఖాతాల్లోని షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనే అంశంపై కంపెనీ మార్గదర్శకాలను కోరింది.

పిఎమ్‌ఎస్ (PMS) అనేది నిపుణులు క్లయింట్ల తరపున స్టాక్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించే పెట్టుబడి సేవ. ఇందులో ‘నాన్-డిస్క్రిషనరీ’ మోడల్ కింద పెట్టుబడి నిర్ణయాలన్నీ క్లయింట్ మాత్రమే తీసుకుంటారు. మేనేజర్ కేవలం ఆ ట్రేడ్‌లను అమలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. సెబీ తన తాజా స్పష్టతలో.. ఆ షేర్లు క్లయింట్ పేరు మీదే ఉంటాయని, యాజమాన్య హక్కులు కూడా వారివే కాబట్టి, రుణాలు పొందేందుకు వాటిని కొలేటరల్‌గా అంటే హామీగా ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛ ఇన్వెస్టర్లకు ఉంటుందని తెలిపింది. అయితే.. ఈ తాకట్టు నిర్ణయం పూర్తిగా క్లయింట్ స్వంతం కావాలి. ఈ ప్రక్రియను పోర్ట్‌ఫోలియో మేనేజర్ చేసిన అప్పుగా పరిగణించబోమని.. ఎందుకంటే నిబంధనల ప్రకారం పోర్ట్‌ఫోలియో మేనేజర్లు రుణాలు తీసుకోవడం నిషేధమని సెబీ పేర్కొంది.

మరో కీలకమైన అంశంలో.. ఒకవేళ సదరు తాకట్టును లెండర్ అంటే రుణదాత ఇంకా క్లెయిమ్ చేయనంతవరకు, ఆ షేర్లను పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ ‘అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్’ పరిధిలోనే లెక్కించవచ్చని సెబీ అనుమతించింది. దీనివల్ల మేనేజర్ల ఏయూఎమ్ గణాంకాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అయితే.. పోర్ట్‌ఫోలియో మేనేజర్లు ఈ రుణ లావాదేవీలలో ఏ విధంగానూ భాగస్వామ్యం కాకూడదని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు లోన్ డిఫాల్ట్ అంటే.. బకాయిలు చెల్లించకపోవడం లాంటివి జరిగినప్పుడు రుణదాతలు ఆ షేర్లను మార్కెట్లో విక్రయించే హక్కు కలిగి ఉంటారు. ఇది మార్కెట్ అస్థిరతకు కారణం కావచ్చు కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ నిర్ణయం వెల్త్ మేనేజ్‌మెంట్ రంగానికి కొత్త ఊపును ఇవ్వనుంది.