Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు

  • యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయాలు
  • యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
  • భారం వినియోగదారులపైనే పడుతుందని వ్యాఖ్య
Rahulgandhi

Rahulgandhi

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. యూపీఐ లావాదేవీలపై ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం రహస్యంగా మార్గం సుగమం చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రూ. 2,000 దాటిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి మోడీ ప్రభుత్వం అనుమతించిందన్నారు. రూ. 2,000 పైబడిన లావాదేవీల సంఖ్య కేవలం 5 శాతమే అయినప్పటికీ.. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో సుమారు 65 శాతం ఈ లావాదేవీల నుంచే వస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా యూపీఐ ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలపై.. అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్రం ఆదేశించింది. అయితే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై మాత్రం ఛార్జీలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

‘‘మోడీ ప్రభుత్వం యూపీఐపై ఫీజులు విధించేందుకు నిశ్శబ్దంగా తలుపులు తెరిచింది. ఇప్పుడు రూ.2,000కు మించిన వ్యాపారి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) విధించవచ్చు. ఇలాంటి లావాదేవీలు పరిమాణం పరంగా కేవలం 5 శాతం ఉన్నప్పటికీ.. యూపీఐ మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయి’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అయితే రూ.2,000కు మించిన లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు లావాదేవీ మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేవు.

‘భారం వినియోగదారులపైనే’

యూపీఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులపై విధించే ఛార్జీల భారం చివరికి వినియోగదారులపైనే పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘వినియోగదారుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరికి ఎక్కడి నుంచి వస్తాయి? ధరలు పెంచి.. నేరుగా వినియోగదారుల జేబు నుంచే వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన పేమెంట్ కంపెనీలు చాలా కాలంగా భారత్‌లో అమలవుతున్న జీరో-ఎండీఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చే దిశగా మార్గం సుగమం చేసిందని ఆరోపించారు.