IT Returns Filing: రేపే ఆఖరి రోజు.. లేకపోతే రూ.5వేలు జరిమానా

Incometax Returns

Incometax Returns

IT Returns Filing: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే గ‌డువు ఉంది. ఆదివారంతో ఐటీ రిటర్న్స్ దాఖలు సమయం ముగియనుంది. శుక్రవారం వ‌ర‌కు దేశవ్యాప్తంగా 4.52 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌ దాఖ‌లు చేశార‌ని ఇంకమ్ ట్యాక్స్ విభాగం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 43 ల‌క్షల‌కు పైగా ఐటీఆర్‌లు దాఖ‌ల‌య్యాయ‌ని తెలిపింది. ఐటీఆర్ గడువు పెంచుతారని చాలా మంది ఆశలు పెట్టుకోగా.. ప్రస్తుతానికి ఐటీఆర్‌ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించే యోచ‌న తమకు లేదని ఇంకమ్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది.

Read Also:Sprite Cool Drink: రంగు మార్చిన ‘స్ర్పైట్’.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి..!!

రెండేళ్లుగా ఐటీ రిటర్న్స్ గడువును కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. 2020-21 సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించేందుకు గడువు తేదీని గతంలో ఐటీ శాఖ పొడిగించింది. 2021 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో ఈ సారి కూడా గడువు తేదీ పొడిగిస్తారని చాలా మంది భావించారు. ఇంకా చాలామంది ఇప్పటికీ చెల్లింపుల ప్రక్రియ మొదలుపెట్టలేదు. అయితే ఈసారి గడువు పెంచే ఉద్దేశం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. అటు ఐటీ శాఖ కూడా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఒకవేళ గడువు లోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా పడుతుందని ఐటీ శాఖ హెచ్చరించింది. దీంతో చాలామంది చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఇబ్బందులు పడుతున్నారు.