JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?

Jiostar Vs Zee

Jiostar Vs Zee

JioStar vs Zee: భారతదేశపు అగ్రగామి ఓటీటీ దిగ్గజాలు రిలయన్స్-డిస్నీల ఉమ్మడి సంస్థ ‘జియోస్టార్’ (JioStar), ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ (Zee) మధ్య చట్టపరమైన యుద్ధం మరింత ముదిరింది. తమకు హక్కులు ఉన్న పలు సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలను జీ సంస్థ అనధికారికంగా ప్రసారం చేసిందంటూ జియోస్టార్ న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు జీ గ్రూప్‌పై జియోస్టార్ చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వెల్లడించింది.

ఇప్పటికే లండన్ కోర్టులో ముగిసిపోయిన ఒక క్రికెట్ హక్కుల ఒప్పందానికి సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య దాదాపు $1 బిలియన్ (సుమారు రూ.8,300 కోట్లు) ఆర్బిట్రేషన్ వివాదం నడుస్తోంది. ఈ లోపే బాలీవుడ్ సినిమాల రూపంలో మరో కొత్త వివాదం తెరపైకి రావడం మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది.

ఢిల్లీ హైకోర్టు కమిటీ ముందు పిటిషన్
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ముందు జియోస్టార్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు శాటిలైట్ హక్కులు ఉన్న 12 బాలీవుడ్ సినిమాలను, గతేడాది జీ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 20 సార్లు టెలికాస్ట్ చేసిందని జియోస్టార్ ఆరోపించింది. 120 పేజీల ఈ పిటిషన్‌లో ‘జీ’ సంస్థను “నిబంధనల ఉల్లంఘనదారు” (Habitual Infringer) గా జియోస్టార్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా ఆస్తులను $8.5 బిలియన్ల భారీ డీల్‌తో 2024లో విలీనం చేసి ‘జియోస్టార్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

వివాదంలో షారూఖ్, ఆమిర్, అమితాబ్ సినిమాలు
అనధికారికంగా ప్రసారమయ్యాయని చెబుతున్న చిత్రాల జాబితాలో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ హిట్ ‘దీవార్’, ‘త్రిదేవ్’లతో పాటు ఆమిర్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దంగల్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో తామేం తప్పు చేయలేదని జీ వాదించింది. ముఖ్యంగా ‘దంగల్’ సినిమా ప్రసారానికి సంబంధించి తాము సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి సరైన అనుమతులు పొందామని జీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మధ్యవర్తిత్వం, వివాదాల పరిష్కారాలను చూసే ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కేసుపై మే 25న కమిటీ ముందు హాజరు కావాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ ఆ రోజు హాజరు కాకపోతే, మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొనడానికి నిరాకరించినట్లుగా పరిగణిస్తారు. దీనిపై స్పందించడానికి అటు జియోస్టార్, ఇటు జీ సంస్థలు నిరాకరించాయి.

రూ. 250 కోట్ల నష్టపరిహారం?
ఈ వివాదానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇరు సంస్థల మధ్య డజనుకు పైగా లీగల్ నోటీసులు నడిచాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బాలీవుడ్ సినిమాల కాపీరైట్ వివాదంలో జీ సంస్థ నుంచి జియోస్టార్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా నష్టపరిహారం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఫైనల్ అమౌంట్ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు, గత ఏప్రిల్‌లోనే లైసెన్సింగ్ ఒప్పందాలు ముగిసిన తర్వాత కూడా జియోస్టార్ తమ కాపీరైట్ మ్యూజిక్‌ను వాడుకుందని ఆరోపిస్తూ జీ సంస్థ కూడా కోర్టుకెక్కింది. ఆ కేసులో జీ సంస్థ జియోస్టార్ నుండి $3 మిలియన్ల (రూ. 25 కోట్లు) నష్టపరిహారాన్ని కోరుతోంది. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఓటీటీ రంగంలో కంటెంట్ హక్కులు, యాడ్ రెవెన్యూ, రేటింగ్స్ కోసం దిగ్గజాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉందో ఈ వరుస వివాదాలు నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.