MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్‌తో సరికొత్త విప్లవం!

  • టైగర్ గ్లోబల్ కథ ముగిసింది..
  • ఇండియాలో జపాన్ దిగ్గజం 'MUFG' వేట స్టార్ట్
  • ఫిన్‌టెక్ స్టార్టప్‌లపై జపాన్ గురి
Mufg Fund India

Mufg Fund India

MUFG Fund India: భారతీయ స్టార్టప్ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్ వంటి దిగ్గజ ఫండ్ల హవా తగ్గగా… ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జపాన్, ఆసియాకు చెందిన కొత్త తరం వెంచర్ ఫండ్‌లు భారీ పెట్టుబడులతో దూసుకువస్తున్నాయి. వాటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

భారత్‌పై MUFG ‘250 మిలియన్ డాలర్ల’ గురి!
జపాన్‌కు చెందిన అతిపెద్ద ఆర్థిక సంస్థ మిత్సుబిషి యుఎఫ్‌జె ఫైనాన్షియల్ గ్రూప్ (MUFG), భారతదేశంలోని స్టార్టింగ్ – గ్లోత్ స్టేజ్‌ (Early & Growth Stage) స్టార్టప్‌ల కోసం 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,300 – రూ.2,400 కోట్లు) భారీ నిధిని రెడీ చేస్తోంది. ఈ నిధి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ప్రారంభ దశలో ఉన్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడం. అవసరాన్ని బట్టి ఈ నిధిని 400 మిలియన్ డాలర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఫండ్‌ బాధ్యతలను MUFG ఇన్నోవేషన్ పార్టనర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మయాంక్ శిరోమణి పర్యవేక్షించనున్నారు. గతంలో MUFG తన $300 మిలియన్ల ‘గణేష్ ఫండ్’ ద్వారా గ్రోత్ – స్టేజ్ డీల్స్‌పై దృష్టి పెట్టగా, ఈ కొత్త నిధితో ఎర్లీ – స్టేజ్ పెట్టుబడుల్లోనూ అడుగుపెట్టబోతోంది.

×
×
Ad

రంగంలోకి కొత్త పెట్టుబడిదారులు
గతంలో (2020-23) అత్యంత చురుకుగా ఉన్న పాత ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్లోకి నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. టైగర్ గ్లోబల్ 2021లో 55, 2022లో 47 పెట్టుబడులు పెట్టగా, 2025 నాటికి ఆ సంఖ్య 6 కి పడిపోయింది. 2026లో ఇప్పటివరకు ఒక్క పెట్టుబడి కూడా పెట్టలేదు. ఇదే సమయంలో సాఫ్ట్‌బ్యాంక్ విషయానికి వస్తే.. 2021లో 17, 2022లో 4 ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాక, అప్పటి నుంచి భారత్‌లో కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంది.

ఆ శూన్యాన్ని భర్తీ చేస్తున్న సంస్థలు..
ప్రస్తుతం MUFG, సస్క్వెహన్నా ఆసియా VC, ఎన్రిసన్ ఇండియా క్యాపిటల్, SMBC ఆసియా రైజింగ్ ఫండ్, మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ఫండ్లు భారత్‌లో పెట్టుబడులను ముమ్మరం చేశాయి. 2025 నుంచి ఇప్పటివరకు సస్క్వెహన్నా 10, ఎనర్షన్ 15, అలాగే మిరే, MUFG చెరో నాలుగు డీల్స్‌ పూర్తి చేశాయి. ఇదే సమయంలో ప్రముఖ ఇన్వెస్టర్ లాచీ గ్రూమ్ సైతం భారత్‌లో పెట్టుబడులు పెంచారు. 2025లో ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయగా, 2026లో ఇప్పటికే రెండు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఆయన ప్రాంటో, ఈవెన్ హెల్త్‌కేర్, ఆల్ట్ కార్బన్‌లలో పెట్టుబడులు పెట్టగా… డ్రోన్ టెక్ స్టార్టప్ ‘ఎయిర్‌బౌండ్’, ఏవియేషన్ సంస్థ ‘ఆల్టియన్’ లలో కూడా పెట్టుబడులకు రెడీ అవుతున్నారు.

పెట్టుబడులు ఆకర్షిస్తున్న స్టార్టప్‌లు ఇవే..
ఈ కొత్త తరం ఇన్వెస్టర్లు ప్రధానంగా ఫిన్‌టెక్, కన్స్యూమర్ ఇంటర్నెట్, డిజిటల్ సేవల రంగాలపై మొగ్గు చూపుతున్నారు. జూపిటర్, డిఎమ్ఐ ఫైనాన్స్, ధన్, ఆలివ్, స్కైడో, యాప్స్ ఫర్ భారత్, సేఫ్ సెక్యూరిటీ, అట్లిస్, స్నాబిట్, ప్రాంటో, బ్యాటరీ స్మార్ట్ వంటి స్టార్టప్‌లు ఈ నిధులను అందుకుంటున్నాయి.

పెట్టుబడులు పెరగడానికి కారణాలు ఇవే..
భారతీయ స్టార్టప్ మార్కెట్ మునుపటి కంటే ఇప్పుడు మరింత పరిణతి చెందిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంతో పోలిస్తే కంపెనీల విలువలు (Valuations) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఒప్పందాల కోసం విపరీతమైన పోటీ తగ్గింది. జొమాటో, స్విగ్గీ, ఫోన్‌పే, గ్రోవ్, మీషో, జెప్టో వంటి కంపెనీల వల్ల ఇండియన్స్‌కు డిజిటల్ సేవల వినియోగం అలవాటుగా మారింది. దీనివల్ల కొత్త తరం స్టార్టప్‌లు తక్కువ మూలధనంతోనే వేగంగా విస్తరించే అవకాశం దక్కింది. “ప్రస్తుతం యూఎస్ ఫండ్లకు అమెరికాలోని టాప్ ఏఐ (AI) కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టాలా? లేక భారత్‌పై దృష్టి పెట్టాలా? అనే సందిగ్ధత ఉంది. కానీ, భారత్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉన్న మా లాంటి సంస్థలకు ఇది అద్భుతమైన అవకాశం. పోటీ తగ్గడం వల్ల మాకు అత్యంత నాణ్యమైన ఒప్పందాలు లభిస్తున్నాయి. పెట్టుబడులు పెంచడానికి ఇదే సరైన సమయం,” అని మిరే అసెట్ వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈఓ పునీత్ కుమార్ పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ సెక్టార్‌పై ప్రత్యేక ఫోకస్
గత మూడేళ్లుగా పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ మేజర్లు భారతీయ స్టార్టప్‌లపై గట్టిగా దృష్టి పెట్టారు. ఇక్కడి స్టార్టప్‌ల ద్వారా ఆగ్నేయాసియా మార్కెట్లలోనూ అవకాశాలు అందుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు SMBC ఆసియా రైజింగ్ ఫండ్ ఇప్పటికే భారతీయ ఫిన్‌టెక్ రంగంలో సుమారు $100 మిలియన్లు ఇన్వెస్ట్ చేసింది. యెస్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లతో పాటు M2P, మోడిఫై, ఆలివ్, వయానా వంటి ఫిన్‌టెక్, క్రెడిట్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. “ప్రస్తుతం మార్కెట్లో సిరీస్ బి, సి (గ్రోత్ రౌండ్లు) లో నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో బలమైన టెక్నాలజీ, స్పష్టమైన మార్కెట్ పరిధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు ఉన్నాయి. టెక్నాలజీని వాడుకునే భారతీయ జనాభాను టార్గెట్ చేసే స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడమే మా లక్ష్యం,” అని SMBC ఆసియా రైజింగ్ ఫండ్ పార్ట్నర్ రాజీవ్ రాంకా వెల్లడించారు.