India’s Richest Business Families: భారతదేశంలో అట్టడుగు వర్గాల పరిస్థితి ఎలా ఉన్నా.. వ్యాపార కుటుంబాల మాత్రం తమ సంపదను మరింత పెంచుకుంటూ.. క్రమంగా పైపైకి పాకుతున్నాయి.. ఆ సంపద కూడా కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యింది.. వ్యాపార కుటుంబాల సంపద భారీగా పెరుగుతోంది. బార్క్లేస్, హురున్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. 2026 జూన్ నాటికి దేశంలోని మూడు అత్యంత సంపన్న వ్యాపార కుటుంబాల ఉమ్మడి నికర సంపద రూ.42 ట్రిలియన్లకు చేరింది. అంటే సుమారు రూ.42 లక్షల కోట్లు. ఈ మూడు కుటుంబాల సంపద భారతదేశంలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 9 శాతానికి సమానంగా ఉంది.
టాప్-3 సంపన్న కుటుంబాలు ఇవే
ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబం నికర సంపద రూ.25.8 లక్షల కోట్లుగా అంచనా వేశారు. రెండో స్థానంలో కేఎం బిర్లా కుటుంబం ఉంది. ఈ కుటుంబం సంపద రూ.8.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక రూ.8 లక్షల కోట్ల నికర సంపదతో జిందాల్ కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో ఈ టాప్-3 కుటుంబాల సంపద విలువ రూ.1.57 లక్షల కోట్లు పెరిగింది. దీంతో వారి సంయుక్త సంపద $444 బిలియన్లు, అంటే సుమారు రూ.42 ట్రిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.
టాప్-300 కుటుంబాల సంపద ఎంతంటే?
భారతదేశంలోని కుటుంబ ఆధారిత వ్యాపారాల పరిమాణం టాప్-3 కుటుంబాలకే పరిమితం కాలేదు. నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్-300 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ రూ.138 ట్రిలియన్లు, అంటే సుమారు $1.46 ట్రిలియన్లుగా ఉంది. ఈ విలువ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్ వంటి పలు దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
టాప్-10 కుటుంబాల మొత్తం సంపద
2026 జూన్ నాటికి భారతదేశంలోని అత్యంత విలువైన టాప్-10 కుటుంబాల మొత్తం నికర సంపద రూ.70.5 లక్షల కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఉన్న రూ.69 ట్రిలియన్లతో పోలిస్తే ఇది పెరుగుదలను సూచిస్తోంది. టాప్-10లో చోటు దక్కించుకోవడానికి అవసరమైన కనీస సంపద కూడా ఏడాదిలో దాదాపు 14 శాతం పెరిగి రూ.2.5 లక్షల కోట్లకు చేరింది.
అనిల్ అగర్వాల్ కుటుంబానికి భారీ జంప్
వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ కుటుంబం ఈ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించింది. ఏడాది కాలంలో కుటుంబ వ్యాపార విలువ 74.7 శాతం పెరిగింది. దీంతో టాప్-10 ర్యాంకింగ్స్లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది.
తొలి తరం వ్యాపార కుటుంబాల్లో అదానీ నంబర్-1
తొలి తరం వ్యాపార కుటుంబాల జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. అదానీ కుటుంబ నికర ఆస్తి విలువ రూ.19.57 లక్షల కోట్లుగా అంచనా వేశారు. రెండో స్థానంలో భారతీ ఎయిర్టెల్కు చెందిన సునీల్ భారతి మిట్టల్ కుటుంబం రూ.12.1 లక్షల కోట్ల సంపదతో ఉంది. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ షాంఘ్వీ కుటుంబం రూ.4.54 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది.
అందరి సంపద పెరగలేదు
అయితే అన్ని భారతీయ వ్యాపార కుటుంబాల సంపద పెరగలేదు. ఐటీ రంగానికి చెందిన నాడార్ కుటుంబం, ప్రేమ్జీ కుటుంబాల ర్యాంకులు దిగజారాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్కు చెందిన నాడార్ కుటుంబం ఎనిమిదో స్థానానికి, విప్రోకు చెందిన ప్రేమ్జీ కుటుంబం తొమ్మిదో స్థానానికి పడిపోయాయి. ఈ కాలంలో హెచ్సీఎల్ కుటుంబ వ్యాపార విలువ 38 శాతం తగ్గగా, విప్రో కుటుంబ వ్యాపార విలువ 2.3 శాతం తగ్గింది. దీంతో టెక్నాలజీ రంగానికి చెందిన ఈ రెండు ప్రముఖ కుటుంబాలు ర్యాంకింగ్స్లో వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది.
భారత వ్యాపార కుటుంబాల సంపదలో భారీ వృద్ధి
బార్క్లేస్–హురున్ ఇండియా నివేదిక గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలోని ప్రముఖ కుటుంబ వ్యాపారాల ఆర్థిక ప్రాబల్యం ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా అంబానీ, బిర్లా, జిందాల్ కుటుంబాలు టాప్-3లో కొనసాగుతుండగా.. అదానీ, మిట్టల్ వంటి తొలి తరం వ్యాపార కుటుంబాలు కూడా భారీ సంపదతో ముందుకు సాగుతున్నాయి. అదే సమయంలో కొన్ని కుటుంబ వ్యాపారాల విలువ తగ్గడం మార్కెట్ పరిస్థితుల ప్రభావాన్ని కూడా సూచిస్తోంది.

