Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..

Cola War

Cola War

Campa Cola vs Coca-Cola: భారతీయ కూల్ డ్రింక్స్ మార్కెట్‌లో ముఖేష్ అంబానీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ‘కోలా వార్’.. ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కేవలం ధరల యుద్ధానికే పరిమితం కాకుండా, ఇప్పుడు ఈ పోరు దుకాణాల్లోని ‘ఫ్రిజ్‌ల’ వరకు పాకింది. క్యాంపా కోలా ధాటికి చెక్ పెట్టేందుకు గ్లోబల్ దిగ్గజాలు కోకా-కోలా, పెప్సికోలు భారీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ‘క్యాంపా కోలా’ అంతర్జాతీయ దిగ్గజాలు కోకా-కోలా, పెప్సికోల మధ్య పోరు క్లైమాక్స్‌కు చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూజర్స్‌ను ఆకర్షించేందుకు ఈ కంపెనీలు ఇప్పుడు కోట్లాది రూపాయల ఖర్చుతో చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో ఉచితంగా ‘విజి-కూలర్లను’ (గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్లు) ఏర్పాటు చేస్తున్నాయి.

ఏమిటీ ఈ ‘కూలర్’ వ్యూహం..
ఇండియాలో మెజారిటీ అమ్మకాలు వీధి చివర ఉండే చిన్న కిరాణా దుకాణాలు లేదా చిన్న భోజనశాలల నుంచే జరుగుతాయి. ఈ దుకాణదారులకు సొంతంగా రిఫ్రిజిరేటర్లు కొనే స్తోమత ఉండదు. దీనిని ఆసరాగా చేసుకుని కంపెనీలు తమ బ్రాండ్ స్టిక్కర్లు ఉన్న కూలర్లను ఫ్రీగా అందజేస్తున్నాయి. అయితే అలా ఫ్రీగా కూలర్లను ఇచ్చే ముందు ఆయా కంపెనీలు ఈ దుకాణదారులకు ఒక షరతు పెడుతున్నాయి. ఆ షరతు ఏంటంటే.. ఆ కూలర్‌లో కేవలం వారి కంపెనీ ఉత్పత్తులను మాత్రమే ఉంచాలి. ఈ వేసవిలో చల్లని పానీయాల కోసం వచ్చే కస్టమర్ల కంటికి తమ బ్రాండ్ మాత్రమే కనిపించేలా చేయడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

మార్కెట్‌ను షేక్ చేస్తున్న ’10 రూపాయల’ క్యాంపా..
అమెరికన్ దిగ్గజాల ఆధిపత్యాన్ని రిలయన్స్ కేవలం 10 రూపాయల ప్యాకెట్ సైజుతో దెబ్బతీసింది. గత ఆర్థిక సంవత్సరంలో (మార్చి 2024 నాటికి) క్యాంపా కోలా ఏకంగా రూ.4,700 కోట్ల అమ్మకాలను సాధించి, దేశంలోనే నాల్గవ అతిపెద్ద కూల్ డ్రింక్ బ్రాండ్‌గా అవతరించింది. కొన్ని కీలక మార్కెట్లలో రెండంకెల వాటాను సంపాదించి కోక్, పెప్సీలకు ఈ క్యాంపా కోలా నిద్రలేకుండా చేస్తోంది. నిజానికి ఈ కార్పొరేట్ యుద్ధం రిఫ్రిజిరేటర్ తయారీ కంపెనీలకు వరంగా మారింది. బ్లూ స్టార్, వోల్టాస్, హైయర్ వంటి కంపెనీలకు కూలర్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. పెప్సీ బాట్లింగ్ భాగస్వామి వరుణ్ బెవరేజెస్ ఒక్కరే సుమారు 5 లక్షల కూలర్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇండియన్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ మార్కెట్ 2034 నాటికి 3.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఒకవైపు ఎండల తీవ్రత పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చే అంశం కాగా, మరోవైపు ఈ కంపెనీలకు అంతర్జాతీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల సఫ్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముడి పదార్థాల ధరలు పెరిగితే ఈ ‘కూలర్ వార్’ మరింత భారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పంపిణీ వ్యవస్థపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఎవరైతే గల్లీల్లోని చిన్న దుకాణదారుడికి చేరువవుతారో, వారే ఈ కోలా యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు” అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.