పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సరికొత్త వినూత్న అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, ఈ సంస్థ తన ఉద్యోగుల కోసం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
కంపెనీలో పర్యావరణ అనుకూల వాతావరణాన్ని నిర్మించేందుకు ఈ సంస్థ ఒక సరికొత్త ‘గ్రీన్ పాలసీ’ లేదా ‘ఈవీ పాలసీ’ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే తమ ఉద్యోగులకు కంపెనీ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది. కొత్తగా ఈవీ కారు కొనుగోలు చేసే ప్రతి ఉద్యోగికి రూ. 10,000 నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ. 5,000 నగదు బహుమతిని కంపెనీ అందిస్తుంది.
ఇటీవల ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు తీవ్ర ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సంక్షోభ సమయాల్లో దేశీయ ఇంధన నిల్వలను కాపాడుకోవడం ఎంతో అవసరమని సంస్థ భావిస్తోంది.
ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ సూచించిన విధంగా కేవలం ఈవీలకు మారడమే కాకుండా, సహోద్యోగులతో కలిసి ప్రయాణించే ‘కార్ పూలింగ్’ పద్ధతిని, ప్రజా రవాణా వ్యవస్థను (మెట్రో, బస్సులు) విరివిగా ఉపయోగించాలని కంపెనీ ఉద్యోగులను కోరుతోంది.
దేశ ప్రగతిలో భాగస్వామ్యం
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ మాట్లాడుతూ.. సాంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించడం కేవలం పర్యావరణానికే కాదు, దేశ ఆర్థిక రంగానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించడం ద్వారా, దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదూర విజన్కు మద్దతుగా నిలుస్తూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తీసుకున్న ఈ గ్రీన్ ఇనిషియేటివ్ ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. మరికొన్ని ఐటీ , టెక్ సంస్థలు కూడా ఇదే బాటలో నడిచేందుకు ఈ నిర్ణయం స్ఫూర్తిగా నిలవనుంది.
