మార్కెట్లో ఉల్లి ధరలు అదుపు తప్పకుండా చూసేందుకు, రైతులకు మెరుగైన లాభాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ (అత్యవసర నిల్వలు) సేకరణ కోసం ఉల్లి కొనుగోలు ధరను 13 శాతం పెంచుతూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో ఉల్లి కనీస కొనుగోలు ధర ఇప్పుడు క్వింటాల్కు రూ. 1,875 నుండి రూ. 2,125కు చేరింది. ఈ పెంచిన ధరలు 2026 జూలై 4 నుండి అమలులోకి వస్తాయని అధికారిక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
ఈ సీజన్లో ఐదో సారి పెంపు..
ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరలను పెంచడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. ధరల స్థిరీకరణ నిధి కింద 2026 బఫర్ స్టాక్ కోసం ఉల్లి కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండటమే ఈ పెంపునకు కారణం. జూన్ 1 నుండి ఇప్పటివరకు కేవలం 2,000 టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించగలిగారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ధరలు కిలోకు రూ. 12.70 నుండి క్రమంగా రూ. 15.80, రూ. 16.50, రూ. 17.30 మరియు రూ. 18.75 కు పెంచుతూ, తాజాగా కిలోకు రూ. 21.25 (క్వింటాల్కు రూ. 2,125) కు పెంచారు.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. 2025-26లో ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల టన్నులుగా ఉండే అవకాశం ఉంది. ఇది గత ఏడాది ఉత్పత్తితో (307.67 లక్షల టన్నులు) సమానంగా ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో తగినంత ఉల్లి నిల్వలు ఉండగా.. ఇక్క మాత్రం కొరత వచ్చే సూచనలేవీ లేవు.
దేశవ్యాప్తంగా రోజువారీ ఉల్లి రాక 50,000 టన్నులకు పైగా బలంగా ఉంది. ఇందులో మహారాష్ట్ర నుండే 30,000 టన్నుల ఉల్లి మార్కెట్కు వస్తోంది. అక్కడ సగటు ధర కిలోకు రూ. 18 గా ఉంది. దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర కిలోకు రూ. 31 గా ఉంది. రుతుపవనాలు ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వ్యాపారులు ముందస్తుగా ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్ ఉల్లి సాగు దాదాపు 15 రోజులు ఆలస్యమైంది.
ఎగుమతులపై ప్రభావం..
జూన్ నెలలో దాదాపు 1.50 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయింది. అయితే.. రాబోయే రోజుల్లో ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, శ్రీలంక వంటి ప్రధాన మార్కెట్లలో పాకిస్తాన్, చైనా దేశాల నుంచి తక్కువ ధరకే ఉల్లి లభిస్తుండటంతో, భారతీయ ఉల్లికి పోటీ పెరిగింది. అయినా.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల భారతీయ ఉల్లి రైతులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

