Site icon NTV Telugu

PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..

భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కోట్లాది మంది వేతన జీవులకు అత్యంత కీలకమైన సామాజిక భద్రతా పథకం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా అండగా నిలిచే ఈ నిధిపై వచ్చే వడ్డీ రేటు గురించి తాజాగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించింది.

సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈపీఎఫ్ఓ (EPFO) వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు సుమారు 8.25 శాతం వరకు ఉంది. అయితే.. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో వడ్డీ రేటును పెంచాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే, పార్లమెంట్ సభ్యుడు విజయ్ కుమార్ లోక్‌సభలో కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు:

పీఎఫ్ వడ్డీని 10 శాతానికి పెంచే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందా..? ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఏదైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందా.. ? వడ్డీ పెంపు కోరుతూ కార్మిక సంఘాల నుంచి ప్రతిపాదనలు ఏవైనా వచ్చాయా..? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి శోభా కరంద్లేజ్ వివరణ ఇచ్చారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read:NATO: సంచలన నిర్ణయం దిశగా డొనాల్డ్ ట్రంప్..

వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కోరుతూ ఇప్పటి వరకు కార్మిక సంఘాల నుండి ఈపీఎఫ్ఓకు ఎటువంటి అధికారిక విజ్ఞప్తులు అందలేదని మంత్రి స్పష్టం చేశారు. బయట జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలే తప్ప, ప్రస్తుతానికి అటువంటి డిమాండ్ తమ ముందుకు రాలేదని పేర్కొన్నారు. పీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ ఇష్టానుసారంగా నిర్ణయించదు. దీనికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుందన్నారు. ఈపీఎఫ్ఓ సేకరించిన నిధులను (Corpus) ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు, ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది. ఆ పెట్టుబడుల ద్వారా సంవత్సర కాలంలో వచ్చే రిటర్న్స్ (ఆదాయం) ఆధారంగా మాత్రమే వడ్డీ రేటును ఖరారు చేస్తారు. వచ్చిన లాభాలను బట్టి ఖాతాదారులకు ఎంత వడ్డీ ఇవ్వవచ్చో లెక్కగడతారు.

10 శాతం వడ్డీ సాధ్యమేనా?

వడ్డీ రేటును 10 శాతానికి పెంచడం ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం వివరణాత్మకంగా తెలిపింది. దీని వెనుక ప్రధానంగా 1952 ఈపీఎఫ్ స్కీమ్ నిబంధనలు ఉన్నాయి. చట్టం ప్రకారం, ఈపీఎఫ్ఓ తన పెట్టుబడుల ద్వారా పొందిన ఆదాయం కంటే ఎక్కువ వడ్డీని పంచకూడదు. ఒకవేళ ఆదాయం కంటే ఎక్కువ వడ్డీ ఇస్తే, అది సంస్థ అసలు మూలధనాన్ని ఖర్చు చేసినట్లవుతుంది. ఇది దీర్ఘకాలంలో పథకం కుప్పకూలడానికి దారితీస్తుంది. పెట్టుబడులపై వచ్చే రాబడి 8 నుండి 8.5 శాతం మధ్య ఉన్నప్పుడు, 10 శాతం వడ్డీ ఇవ్వడం ఆర్థికంగా అసాధ్యం. అటువంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగుల సెటిల్మెంట్లకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

వడ్డీ రేటు నిర్ణయించేది ఎవరు?

వడ్డీ రేటు నిర్ణయం ఏకపక్షంగా జరుగుతుందా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఇది ఒక త్రైపాక్షిక (Tripartite) ప్రక్రియ అని చెప్పారు. ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ CBT. ఇందులో మూడు వర్గాల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీలు/యాజమాన్యాల ప్రతినిధులు, ఉద్యోగులతో పాటు.. కార్మిక సంఘాల ప్రతినిధులు. వీరందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే వడ్డీ రేటును సిఫార్సు చేస్తారు. కాబట్టి, నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version