పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ ఇంధనం సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు సుమారు రూ.20 తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో పాటు పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు హరిత ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో E85 ఇంధనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 ఉండగా, E85 ఇంధనం ధరను రూ.82.12గా నిర్ణయించారు. దీంతో వినియోగదారులకు లీటరుకు రూ.20 వరకు ఆదా కానుంది.
E85 ఫ్యూయల్ అంటే ఏమిటి?
E85 అనేది 80-85 శాతం ఇథనాల్, 15-20 శాతం గ్యాసోలిన్ (పెట్రోల్) మిశ్రమంతో తయారైన ప్రత్యామ్నాయ ఇంధనం. ఇది ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాల కోసం రూపొందించారు. ఈ వాహనాల్లో ఉండే అధునాతన ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును సర్దుబాటు చేస్తుంది. అయితే E85 ఇంధనాన్ని సాధారణ పెట్రోల్ వాహనాల్లో ఉపయోగించలేరు. ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికత కలిగిన వాహనాల్లో మాత్రమే దీనిని వినియోగించాలి.
E85 ఫ్యూయల్ ప్రయోజనాలు
పెట్రోల్తో పోలిస్తే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 61 శాతం వరకు తగ్గించే సామర్థ్యం.
లీటరుకు రూ.20 వరకు తక్కువ ధర.
ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో సహకారం.
చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి కావడంతో రైతులకు అదనపు ఆదాయ వనరు.
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన హరిత ఇంధన పరిష్కారం.
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి
ఇటీవల హీరో మోటోకార్ప్ తన ప్రముఖ బైక్లైన స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్లను పరిచయం చేసింది. అలాగే మారుతి సుజుకి కూడా వాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ను విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ విభాగంలోకి వచ్చే అవకాశం ఉంది.
E85 ఎక్కడ లభిస్తుంది?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 ప్రభుత్వ రంగ పెట్రోల్ బంక్లలో E85 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రభుత్వం దీని విస్తరణకు భారీ ప్రణాళికలు రూపొందించింది. డిసెంబర్ 2026 నాటికి 500 పెట్రోల్ బంక్లలో E85 అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 పెట్రోల్ బంక్లకు విస్తరించనుంది. ఈ చర్య ద్వారా 2030-31 నాటికి దేశంలో ఇథనాల్ మిశ్రమ లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

