Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు

Cyber Fraud (2)

Cyber Fraud (2)

Cyber Fraud: ఒకప్పుడు బ్యాంక్ మోసాలంటే ముందుగా గుర్తొచ్చేది ఓటీపీ. ఫోన్ చేసి ఓటీపీ అడగడం, అది చెప్పగానే బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమవడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేవి. దీంతో ఇప్పుడు చాలా మందికి ఒక అవగాహన వచ్చింది. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని తెలుసుకున్నారు. కానీ ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఓటీపీ అడగకుండానే ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అందుకే ఓటీపీ చెప్పలేదంటే పూర్తిగా సురక్షితమే అనుకోవడం కూడా సరైన ఆలోచన కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, స్క్రీన్ షేరింగ్ యాప్‌లు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు బ్యాంక్, కొరియర్ కంపెనీ, విద్యుత్ శాఖ, ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ లింక్‌లు పంపించి వాటిని ఓపెన్ చేయాలని చెబుతుంటారు. మరికొందరు సమస్య పరిష్కారం పేరుతో ఒక యాప్ డౌన్‌లోడ్ చేయమని సూచిస్తారు. అలాంటి యాప్‌లకు అనుమతులు ఇవ్వడం లేదా స్క్రీన్‌ను షేర్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వినియోగదారుడికి తెలియకుండానే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా బయటపడే ప్రమాదం ఉంది. అలా చేస్తే మీ డబ్బును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసే ప్రమాదం ఉంది.

ఇంకో  మోసం నకిలీ చెల్లింపు అభ్యర్థనలు. డబ్బు వస్తుందని చెప్పి ఒక అభ్యర్థన పంపించడం, లేదా రీఫండ్ ఇవ్వాలని చెప్పి కొన్ని సూచనలు పాటించమని చెప్పడం జరుగుతోంది. చాలామంది తొందరలో ఆ సూచనలను పాటించి తెలియకుండానే చెల్లింపును పూర్తి చేస్తారు. అలాగే గూగుల్‌లో కనిపించిన కస్టమర్ కేర్ నంబర్ నిజమని నమ్మి ఫోన్ చేయడం కూడా ప్రమాదకరం. కొంతమంది మోసగాళ్లు నకిలీ నంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌లో ఉన్న సంప్రదింపు వివరాలనే ఉపయోగించడం మంచిది.

ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు అది అధికారిక వెబ్‌సైట్‌దేనా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించాలి. తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదు. ఫోన్‌లో అవసరం లేని అనుమతులు ఇవ్వకూడదు. అలాగే బ్యాంక్ లేదా యూపీఐ యాప్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లు వస్తే వెంటనే పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే ఆలస్యం చేయకుండా బ్యాంక్‌ను సంప్రదించడం మంచిది.

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పద్ధతులను మార్చుకుంటున్నారు. అందుకే కేవలం ఓటీపీ చెప్పకపోతే చాలు అనుకునే రోజులు దాదాపు ముగిశాయి. డిజిటల్ సేవలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. చిన్న జాగ్రత్తలు, సరైన అవగాహన, అధికారిక మార్గాలనే ఉపయోగించే అలవాటు ఉంటే ఇలాంటి కొత్త తరహా మోసాల నుంచి చాలా వరకు రక్షించుకోవచ్చు.