Site icon NTV Telugu

Crude oil: ముడిచమురు సెగతో స్టాక్ మార్కెట్‌లో వణుకు.. రిలయన్స్, OMC కంపెనీల భవిష్యత్తు ఏంటి?

Crude Oil

Crude Oil

Crude oil: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ భీకర పోరు ప్రభావం నేరుగా ముడిచమురు ధరలపై పడుతోంది. భారత్ వంటి భారీ చమురు దిగుమతిదారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పెట్రోలియం ఎగుమతుల్లో 20%, ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరాలో 20% వాటా కలిగిన ‘హార్ముజ్ జలసంధి’ ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడిచమురులో 50%, ఎల్‌ఎన్‌జీలో 54% ఈ మార్గం ద్వారానే వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధిని బంద్ చేసింది. దీని పరిణామాలు ఇండియాపై ఏవిధంగా పడబోతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Xiaomi 17 Ultra: 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో.. షియోమి ఫోన్‌ విడుదల.. ధర ఇదే

ఈ మార్గంలో అంతరాయం కలిగితే షిప్పింగ్, బీమా ఖర్చులు పెరిగి, బ్రెంట్ క్రూడ్ ధరలు 5-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర $65 నుండి $73కు చేరింది. చమురు ధరలు పెరిగితే విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతుంది. కరెంట్ ఖాతా లోటు పెరిగి రూపాయి విలువ క్షీణించవచ్చు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు మండిపోతాయి. క్రూడ్ ధర బ్యారెల్‌కు $100 దాటితే నిఫ్టీలో 3-5% అస్థిరత ఏర్పడవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నిధులు వెనక్కి తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చమురు కంపెనీల (OMC) పరిస్థితి ఏంటి..
ICRA నివేదిక ప్రకారం.. IOCL, BPCL, HPCL వంటి కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోతే ఈ కంపెనీల ‘మార్కెటింగ్ మార్జిన్లు’ దారుణంగా పడిపోతాయి. పెయింట్స్, ఏవియేషన్, కెమికల్ రంగాలు కూడా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ నిపుణుడు అభిషేక్ భట్ విశ్లేషణ ప్రకారం రిలయన్స్ పరిస్థితి మిశ్రమంగా ఉంటుందని అన్నారు. రిలయన్స్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (GRM) బలంగా ఉంటే శుద్ధి వ్యాపారం లాభపడవచ్చని అన్నారు. పెట్రోకెమికల్ విభాగంలో ముడి సరుకు ఖర్చులు పెరిగి లాభాలు తగ్గవచ్చని అంచనా వేశారు. రిలయన్స్ రిటైల్, జియో వంటి ఇతర వ్యాపారాలు చమురు రంగ నష్టాలను కొంతవరకు భర్తీ చేయగలవని, ప్రస్తుతం రిలయన్స్ షేరు ₹1,394 వద్ద ట్రేడవుతోందని చెప్పారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సవాళ్లు తప్పవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు ఐటీ, ఫార్మా వంటి సురక్షిత రంగాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

READ ALSO: Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..

Exit mobile version