Business Today: డాక్టర్ రెడ్డీస్కి మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు
హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం పరిధిలోని గ్లోబల్ లైట్హౌజ్ నెట్వర్క్లో చోటు సంపాదించింది. భాగ్య నగరంలోని బాచుపల్లిలో ఈ సంస్థకు అతిపెద్ద మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్ ఉంది. అందులో అడ్వాన్స్డ్ అనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఆరు ఇండస్ట్రీ డాట్ ఓ టెక్నాలజీలను అందుబాటులోకి తేవటంతో ఈ ఘనతను సొంతం చేసుకుంది. వీటి వల్ల ఇంధనం వాడకం గణనీయంగా తగ్గటంతోపాటు తయారీ ఖర్చు, సమయం గణనీయంగా ఆదా అయ్యాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
వాయిస్తో పనిచేసే వాషింగ్ మెషీన్. ఇండియాలో ఫస్ట్
వాషింగ్ మెషీన్ల చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా వాయిస్తో పనిచేసే వాషింగ్ మెషీన్ అందుబాటులోకి వచ్చింది. హాయర్ కంపెనీ ఇన్బిల్ట్ వాయిస్ కంట్రోల్ సదుపాయంతో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ని విడుదల చేసింది. ఈ మెషీన్లో డ్రమ్ పెద్దగా ఉంటుందని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డైనమిక్ బ్యాలెన్స్ సిస్టమ్, యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ వంటివి ఉన్నట్లు తెలిపింది. ఈ వాషింగ్ మెషీన్ని మనం ఇంట్లో ఎక్కడ నుంచైనా నోటి మాట ద్వారా ఆపరేట్ చేయొచ్చని పేర్కొంది.
మన వృద్ధి రేటు దాదాపు 7 శాతం
ప్రపంచ ఆర్థిక మాంద్యంతోపాటు అన్ని ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పనితీరుపై ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా గ్రోత్ రేట్ దాదాపు 7 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. కొవిడ్ ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఇంత విజయవంతంగా కోలుకోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన బలమైన పునాదే కారణమని చెప్పారు.
ఇండియాకి త్వరలో గూగుల్ రివార్డ్ పాయింట్ సిస్టమ్
ఇండియాలోని ప్లేస్టోర్ యూజర్ల కోసం గూగుల్ సంస్థ కొద్ది వారాల్లో రివార్డ్ పాయింట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకురానుంది. ప్లేస్టోర్లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఈ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ మేరకు పాపులర్ యాప్స్ అండ్ గేమ్స్ డెవలపర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రివార్డ్ పాయింట్ సిస్టమ్ ప్రస్తుతం 28 దేశాల్లో అమలవుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు 100 మిలియన్ల మందికి పైగా లబ్ధి పొందారని గూగుల్ సంస్థ తెలిపింది.
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ రాజీనామా
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్.. రెగ్యులేటరీకి తెలియజేసింది. ఈ నిర్ణయం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రవి కుమార్ న్యూయార్క్లో ఇన్ఫోసిస్కి సంబంధించిన మల్టిపుల్ సర్వీసులను లీడ్ చేశారు. ముఖ్యంగా డిజిటల్ సేల్స్, కన్సల్టింగ్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ మరియు ప్రాసెస్ వర్టికల్స్ వంటి సెగ్మెంట్లకు నాయకత్వం వహించారు. రవి కుమార్ రాజీనామా నేపథ్యంలో ఇన్ఫోసిస్కి ఆయన అందించిన సేవలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అభినందించారు.
సాగు రుణాల్లో 16 శాతం బ్యాడ్ లోన్లు
వ్యవసాయ రుణాల్లో సుమారు 16 శాతం బ్యాడ్ లోన్లుగా మిగిలిపోతున్నాయని ట్రాన్స్యూనియన్ సిబిల్ పేర్కొంది. సాగు రంగానికి ఇస్తున్న మొత్తం రుణాల్లో 70 ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 పాయింట్ 6 లక్షల కోట్ల రూపాయల లోన్లు పంపిణీ చేశారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14 పాయింట్ 6 కోట్ల మంది రైతులు ఉండగా అందులో దాదాపు సగం మంది మాత్రమే అంటే 7 పాయింట్ 4 కోట్ల మందే రుణాలు తీసుకున్నారని సిబిల్ తన నివేదికలో వివరించింది.
