ఢిల్లీ మరియు గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది. క్యాబ్ డ్రైవర్లకు నిజమైన యాజమాన్య హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ‘భారత్ టాక్సీ’ రూపుదిద్దుకుంటోంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా, దేశవ్యాప్తంగా డ్రైవర్లను ఆర్థికంగా సాధికారులను చేయడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతం భారత్ టాక్సీని ఢిల్లీ, గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సాఫ్ట్ లాంచ్ చేశారు. డ్రైవర్ల హక్కుల కోసం గళమెత్తే, ప్రపంచంలోనే తొలి జాతీయ మొబిలిటీ సహకార సంస్థగా పేరొందిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ ఈ సేవలను ప్రారంభించింది. బీటా యూజర్లతో ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద డ్రైవర్-యాజమాన్య నెట్వర్క్గా భారత్ టాక్సీ ఎదగబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఢిల్లీ, గుజరాత్లలో కార్లు, ఆటోలు, బైక్ సేవల ద్వారా ఇప్పటి వరకు 51,000 మందికి పైగా డ్రైవర్లను ఈ ప్లాట్ఫార్మ్ పైకి తీసుకొచ్చామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి లాంచ్కు కొంత సమయం పట్టినా, ఇప్పటికే ఇది భారీ డ్రైవర్-యాజమాన్య మొబిలిటీ నెట్వర్క్గా నిలుస్తోందని పేర్కొన్నారు.
భారత్ టాక్సీ మొబైల్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ట్రయల్ & ఫీడ్బ్యాక్ కోసం అందుబాటులో ఉంది. iOS వెర్షన్ కూడా త్వరలో విడుదల కానుంది. యాప్ను “Bharat Taxi Driver” పేరుతో Sarkar Taxi Cooperative Limited విడుదల చేసినదానినే డౌన్లోడ్ చేయాలని సంస్థ సూచించింది. ప్రారంభ దశలోనే యాప్కు మంచి వినియోగదారుల స్పందన లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యాప్ ప్రత్యేకతల్లో ఒకటి — ఇది ఢిల్లీ మెట్రోతో అనుసంధానం చేయబడటం. దీంతో ప్రయాణికులు మెట్రో, క్యాబ్ సేవలను ఒకే యాప్లో బుక్ చేసుకుని, తమ మొత్తం ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మల్టీ-మోడల్ రవాణాను మరింత సులభతరం చేస్తుందని సహకార సంస్థ పేర్కొంది.
