Site icon NTV Telugu

Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..

Biharmoney

Biharmoney

బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదనే పేరుతో బ్యాంకులు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022 నుంచి 2025 వరకు) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిసి ఏకంగా రూ. 19,000 కోట్లు వసూలు చేశాయన్న వార్త ఇప్పుడు సగటు ఖాతాదారుడికి దిమ్మతిరిగేలా చేస్తోంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ఈ గణాంకాలు చూస్తుంటే.. బ్యాంకులు సేవ చేయడం పక్కన పెట్టి వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్నాయా అనే అనుమానం కలుగుతోంది.

Also Read:Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

మొత్తం రూ. 19,000 కోట్లలో సింహభాగం అంటే రూ. 11,000 కోట్లు ప్రైవేటు బ్యాంకులే లాగేసుకున్నాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ రూ. 3,872 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యాక్సిస్ బ్యాంక్ ఉంది ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తక్కువేం తినలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతా కలిసి సుమారు రూ. 8,000 కోట్లు వసూలు చేశాయి.

Also Read:TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2020 నుంచే ఈ చార్జీలను పూర్తిగా రద్దు చేసింది. మరి ఎస్‌బీఐ చేయగలిగిన పని మిగిలిన బ్యాంకులు ఎందుకు చేయడం లేదనేది ఖాతాదారుల ప్రధాన ప్రశ్న. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ.. ‘ఈ వసూళ్లు బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.2 శాతం మాత్రమే.. ఇది కేవలం సేవల నిర్వహణ కోసమే’ అని చెప్పుకొచ్చారు. కానీ ఖాతాదారులు మాత్రం బ్యాంకులు మినమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ వసూలు చేసే విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

డబ్బులు లేకనే కదా అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, అలాంటి వారి దగ్గర మళ్ళీ వేల కోట్లు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ఆయా బ్యాంకుల ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. ఖాతాదారుల పక్షాన ఉండాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇలాంటి దోపిడీని ఎందుకు ఆపడం లేదు అంటూ ఆర్బీఐని విమర్శిస్తు్న్నారు. డిజిటల్ బ్యాంకింగ్ అంటూ అందరినీ అకౌంట్లు తెరవమన్నారు, ఇప్పుడు సర్వీస్ చార్జీల పేరుతో సామాన్యుడి సొమ్మును బ్యాంకులే మింగేస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జన్ ధన్ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నవారికి చార్జీలు ఉండవని ప్రభుత్వం చెబుతున్నా.. మధ్యతరగతి ప్రజలు వాడే సాధారణ సేవింగ్స్ అకౌంట్లపై ఈ పెనాల్టీల భారం మోపడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల పేరుతో బ్యాంకులు లాభపడటం తప్ప, ఖాతాదారుడికి కలిగే ప్రయోజనం ఏమీ లేదని జనం మండిపడుతున్నారు.

Exit mobile version