మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతోంది. ఇటీవల దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్పై సుమారు 3 రూపాయలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలు పూర్తిగా తగ్గలేదు. ధరల పెంపునకు ముందు రోజుకు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయిన చమురు కంపెనీలు, ప్రస్తుతం రోజుకు సుమారు రూ. 750 కోట్ల వరకు నష్టపోతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ వెల్లడించారు. ఈ భారీ నష్టాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) దిగుమతి ఖర్చులు కూడా ఉన్నాయని, అయితే ప్రస్తుతం చమురు సంస్థలకు ఎలాంటి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభం కాకముందు, ఫిబ్రవరి నెలలో భారతీయ బాస్కెట్ ముడి చమురు ధర బ్యారెల్కు 69.01 డాలర్లుగా ఉండేది. కానీ గత 80 రోజులుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల మే 15 నాటికి ఈ ధర ఏకంగా 110.73 డాలర్లకు చేరింది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే బ్యారెల్కు 41.72 డాలర్లు అదనంగా పెరిగింది.
భారత్పై ప్రభావం..
భారతదేశం తన అవసరాలకు సరిపడా ముడి చమురులో 85 శాతానికి పైగా, ఎల్పీజీలో 60 శాతాన్ని అంతర్జాతీయ మార్కెట్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం ముడి చమురు, 90 శాతం ఎల్పీజీ చారిత్రాత్మకంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గం గుండానే భారత్కు చేరుకుంటాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య రేగిన వివాదం వల్ల ఈ సముద్ర మార్గంలో సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల భారత్ చమురు దిగుమతుల కోసం పెట్టే మొత్తం ఖర్చు 60 శాతానికి పైగా పెరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థలపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 27న పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 మేర తగ్గించింది. అయితే, వీటిపై వ్యాట్ (VAT), సేల్స్ టాక్స్ ద్వారా ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పన్ను తగ్గింపు నిర్ణయాలు తీసుకోలేదు.
