Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?

Employeess

Employeess

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వరుస భేటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా, ఉద్యోగుల వార్షిక వేతన పెంపు (ఇంక్రిమెంట్) అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా వారి బేసిక్ పేపై కేవలం 3 శాతం మాత్రమే ఇంక్రిమెంట్ లభిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే ఈ పెంపు ఎంతమాత్రం సరిపోదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి భిన్నంగా ప్రభుత్వ రంగంలో ఈ శాతం చాలా తక్కువగా ఉందని, కాబట్టి ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్‌ను 5 శాతం నుంచి 6 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) చ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NCJCM) తమ నివేదికలో 3% ఉన్న ఇంక్రిమెంట్‌ను నేరుగా 6%కి పెంచాలని ప్రతిపాదించాయి. అదేవిధంగా, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ (MSA) కూడా ఒకే పదవిలో దీర్ఘకాలం పనిచేసే ఉద్యోగుల ఆదాయం నిలకడగా పెరిగేలా ఏటా 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరింది. ప్రస్తుత విధానంలో ఏటా పెరిగే 3% ఇంక్రిమెంట్ బేసిక్ పేలో కలవడం వల్ల, తర్వాతి సంవత్సరం పెంపు ఆ పెరిగిన మొత్తంపై లెక్కిస్తారు. దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉన్నందున, శాతాన్ని పెంచడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా గణనీయమైన లబ్ధి చేకూరుతుంది.

మరోవైపు కరువు భత్యం (DA) , వార్షిక ఇంక్రిమెంట్ రెండూ వేర్వేరు ఉద్దేశాలు కలిగినవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. డీఏ అనేది కేవలం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కొనుగోలు శక్తిని కాపాడేందుకు ఉపయోగపడుతుందని, కానీ ఇంక్రిమెంట్ అనేది ఉద్యోగి అనుభవం, సర్వీసు కాలం, నిజమైన ఆదాయ పెరుగుదలకు సంకేతమని వివరించాయి. కాబట్టి కేవలం డీఏ పెంచితే సరిపోదని.. వార్షిక ఇంక్రిమెంట్ శాతాన్ని కూడా ఖచ్చితంగా పెంచాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ అంశంతో పాటు ఉద్యోగుల ఇతర కోరికలపై చర్చించేందుకు 8వ వేతన సంఘం రాబోయే ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జైపూర్‌లో కీలక సమావేశం నిర్వహించనుంది.