బిగ్ బాస్ షో సీజన్ 5 ఐదో రోజు ఆట కాస్తంత రంజుగానే సాగింది. నాలుగవ తేదీ రాత్రి పదకొండు తర్వాత ప్రియాంక (పింకీ) మానస్ కు ఫ్లవర్ అందించి, దాన్ని జాగ్రత్తగా పెట్టమని, ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి లవ్వాటకు ఫిదా అయిన సన్నీ ఆమెతో ఆ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కనిపించేది కేవలం మార్నింగ్ సాంగ్ ప్లే చేసినప్పుడు డాన్స్ చేస్తూనే! ఆ తర్వాత బిగ్ బాస్ సోఫాలో కూర్చోమన్నప్పుడు కనిపిస్తున్నారు తప్పితే… అందరూ ఎక్కడా ఒకేసారి కనిపించే ఆస్కారం లేకుండా పోయింది. ఇక శుక్రవారం వినాయక చవితి కావడంతో మధ్యాహ్నం బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి వేడుకలను కంటెస్టెంట్స్ నిర్వహించారు. అందరూ పండగకి తగ్గట్టుగా కలర్ ఫుల్ డ్రసెస్ లో మెరిసిపోయారు. వినాయక చవితి లాంటి పెద్ద పండగను ఫ్యామిలీ మెంబర్స్ తో చేసుకోలేకపోయామనే వెలితిని అందరూ ఫీలయ్యారు. కొందరు ఇంట్లోని భార్యాబిడ్డలను తలుచుకుని కంట తడిపెడితే, మరికొందరు… వినాయక చవితిని బిగ్ బాస్ హౌస్ లో జరుపుకోవడం లైఫ్ లోనే మెమొరబుల్ ఇన్సిడెంట్ అంటూ పాజిటివ్ గా తీసుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో మొదటి రెండు మూడురోజులు నార్మల్ గా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంతో సాగిపోయింది. అయితే ఐదో రోజు వచ్చే సరికీ ఎవరైనా గ్రూపులు కడుతున్నారేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఇంకా అలాంటిదేమీ లేదని మరి కొందరు త్రోసిపుచ్చారు. ఇక లగ్జరీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ‘కుండలోని రుచుల జాడవేరు’ అంటూ ఓ సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఓ కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ ను భుజానకెత్తుకోవాలి. గార్డెన్ ఏరియాలో ఉండే కుండలు ఒక్కో ఆహార పదార్థానికి సింబల్… తమకు కావాల్సిన వాటిని ఎంచుకుని భుజాలపైన ఉండే వ్యక్తి కర్రతో ఆ కుండల్ని పగల కొట్టాలి. అయితే… అలా కొట్టే వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఈ ఇంట్రస్టింగ్ టాస్క్ లో విశ్వను రామచంద్ర భుజానికి ఎత్తుకోగా, మిగిలిన సభ్యుల గైడెన్స్ తో ఇన్ టైమ్ లోనే కొట్టాల్సిన పది కుండలను కొట్టేశారు. అయితే… ఈ టాస్క్ కు సభ్యుల ఎంపికలో తనను సరిగా ఇన్వాల్వ్ చేయలేదంటూ నటరాజ్ మాస్టర్ చిన్నబుచ్చుకోవడం కొసమెరుపు.
నిజానికి కంటెస్టెంట్స్ కు అసలు సిసలు టఫ్ టాస్క్ ఆ తర్వాత వచ్చింది! ప్రతి సభ్యుడూ… హౌస్ లోని బెస్ట్ పర్శన్ ను వరెస్ట్ పర్శన్ ను ఎంపిక చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ఇందులో ప్రియాంక లోబోను బెస్ట్ పర్శన్ గా, ఉమను వరెస్ట్ పర్శన్ గా సెలక్ట్ చేయగానే సిట్యుయేషన్ హీటెక్కి పోయింది. ఉమను ఎందుకు వరెస్ట్ పర్శన్ గా ఎంపిక చేయాల్సి వచ్చిందో ప్రియాంక చెప్పే క్రమంలో మాటామాటా పెరిగి, అందరు సభ్యులు వారిని అడ్డుకోవాల్సి వచ్చింది. ప్రియాంక… ఉమని ఉద్దేశించి ‘షటప్’ అని పరుషంగా మాట్లాడటంతో గొడవ పీక్స్ కు వెళ్ళి, ఆ వెంటనే ఆమె తప్పును గ్రహించి సారీ చెప్పడంతో సద్దుమణిగింది. ఓవర్ ఆల్ గా మెజారిటీ సభ్యులు వరెస్ట్ పర్శన్ గా జస్వంత్ (జెస్సీ)ని ఎంపిక చేయడంతో అతనికి బిగ్ బాస్ జైలు శిక్ష విధించాడు. తోటి సభ్యుల సానుభూతి మధ్య బిగ్ బాస్ సీజన్ 5లో జైలుకు వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ గా జెస్సీ నిలిచాడు. ఇలా జెస్సీని జైలుకు పంపడం ద్వారా అతను బహుశా ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చనే భావన వ్యూవర్స్ లో కలిగింది. మరి శని, ఆదివారాల్లో ఓట్లను బట్టి ఎవరిని నాగార్జున ఎలిమినేట్ చేస్తారు? ఎవరెవరిని సేఫ్ చేస్తారు? అనేది చూడాలి.