Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!

Ganesh Chaturthi 2025

Ganesh Chaturthi 2025

Ganesh Chaturthi 2026: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం సంతరించుకుంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం కావడంతో బొజ్జ గణపయ్య పూజకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర దినాన భక్తులు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో తమ ఇళ్లు, వివిధ వేదికలు, పండళ్లలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మతపరమైన విశ్వాసాల ప్రకారం, ఈ 10 రోజుల పాటు గణపతి భూమిపై నివసిస్తూ తన భక్తుల కష్టాలను, విఘ్నాల్ని తొలగిస్తారని నమ్ముతారు. వేద పంచాంగం ప్రకారం.. భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి, మధ్యాహ్న కాలం కలసి రావడంతో గణపతి విగ్రహాన్ని స్థాపించడానికి సెప్టెంబర్ 14న ఉదయం 11:02 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 గంటల వరకు అత్యంత శుభ సమయంగా నిర్ణయించారు. ఈ నిర్ణీత సమయంలో భక్తులు శాస్త్రోక్తంగా, విధివిధానాలతో బొజ్జ గణపయ్యను తమ గృహాలలో ప్రతిష్ఠించుకోవచ్చు.

శుభ ముహూర్తం..

స్వామివారి పూజ, విగ్రహ స్థాపన కోసం ముందుగానే కొన్ని ముఖ్యమైన పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణహిత (ఇకో-ఫ్రెండ్లీ) లేదా మట్టితో చేసిన గణపతి విగ్రహం, పూజ కోసం ఒక శుభ్రమైన పీఠం (చౌకీ), దానికి పరిచేందుకు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం తీసిపెట్టుకోవాలి. వీటితో పాటు కలశం, మామిడి ఆకులు, పీచు ఉన్న కొబ్బరికాయ, కుంకుమ, మౌళి (తాడు/కలవ), చందనం, అక్షతలు (విరగని బియ్యం) అవసరమవుతాయి. అలాగే తాజా పూలు, గణపతికి ఎంతో ప్రియమైన పచ్చని గరిక, ధూపం, అగరబత్తులు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం, కర్పూరం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించడానికి ఉండ్రాలు, లడ్డూలు, పండ్లు (ఋతువును బట్టి దొరికే పండ్లు) సిద్ధం చేసుకోవాలి.

పూజా విధానం..

ముందుగా పూజా స్థలాన్ని చక్కగా శుభ్రం చేసుకుని, పీఠాన్ని అమర్చి దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. ఆ తర్వాత నిర్ణీత శుభ ముహూర్తంలో ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుని విగ్రహాన్ని భక్తితో ప్రతిష్ఠించాలి. ఆ పీఠం పక్కనే బియ్యం ఉంచి, దానిపై నీటితో నింపిన కలశాన్ని ఉంచి, మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించాలి. అనంతరం స్వామివారికి షోడశోపచార పూజ చేసి, రోలి, అక్షతలు, చందనం, కనీసం 21 గరిక పోచలను తప్పనిసరిగా సమర్పించాలి. ఆపై స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా నివేదించి, ధూపదీపాలు వెలిగించి, కుటుంబ క్షేమం, శ్రేయస్సును కాంక్షిస్తూ హారతి ఇవ్వడంతో పూజ సంపూర్ణమవుతుంది.