SI Preliminary Written Test: రేపే ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి మర్చిపోవద్దు..

Si Preliminary Written

Si Preliminary Written

SI Preliminary Written Test: నిరుద్యోగ యువతకు శుభవార్త చెబుతూ ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి కూడా పూనుకుంది.. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న అనగా రేపు నిర్వహించనున్నారు.. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఆదివారం జరగనున్న ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 పరీక్ష ఉండనుంది..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

పరీక్ష రాసే ఎస్‌ఐ అభ్యర్థులు ఇవి తప్పకుండా గుర్తించుకోవాలి.. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.. ఇక, మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, లాగ్‌ టేబుల్‌, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల లాంటివి ఏవైనా ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించరు. వాటిని అసలు పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండబోవని పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జామ్‌ సెంటర్‌ విషయంలో గందరగోళ పరిస్థితి ఉండకుండా.. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. మరోవైపు పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు.. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి స్పష్టం చేశారు.. కాగా, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి.. ఇప్పటి వరకు 1,71,936 మంది సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.. ఈ లెక్కన చూసినా.. ఒక్కో పోస్టుకు సగటున 418 మంది పోటీ పడుతున్నారన్నమాట.. ఇప్పటి వరకు ఎలా చదివాం అన్నది కాదు.. ఎగ్జామ్‌ ఎలా రాశాం అన్నది ఎంతో కీలకం.. కాబట్టి అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా.. కూల్‌గా ఎగ్జామ్‌ రాయాలని సూచిస్తున్నారు విద్యారంగ నిపుణులు.