Pydithalli Ammavari Jatara 2026: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ సిబ్బంది ప్రకటించారు. భక్తుల కోసం నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. జాతర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1, గురువారం మండల దీక్ష ప్రారంభమవుతుంది. అనంతరం చదురు గుడి వద్ద, వనం గుడి వద్ద పందిరి రాట మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక, అక్టోబర్ 22, గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం కానుంది. అనంతరం జాతరలో ప్రధాన ఘట్టమైన అక్టోబర్ 26, సోమవారం తొలేళ్ల మహోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 27, మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించే సిరిమాను ఉత్సవం జరగనుంది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరలో భాగంగా నవంబర్ 3, మంగళవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 7, శనివారం కలశ జ్యోతి ఊరేగింపు జరగనుంది. మహోత్సవాల చివరి దశలో నవంబర్ 10, మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, నవంబర్ 11, బుధవారం చండీ హోమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలతో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు. జాతరలోని ప్రధాన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.

