Navratri 2025 Day 2: గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

  • ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో రెండవ రోజు..
  • శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనక దుర్గమ్మ..
Sri Gayatri Devi

Sri Gayatri Devi

Navratri 2025 Day 2: దసరా ఉత్సవాల్లో రెండవ రోజున కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీ గానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది.. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, మొదటి రోజు అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.. అనూహ్యంగా.. ఊహించని దానికంటే భక్తుల రద్దీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. శ్రీ శక్తి పథకం ఫ్రీ బస్సు ఉండడంతో భారీగా అమ్మ వారి ఆలయానికి తరలివచ్చారు మహిళలు.. దసరా నవరాత్రులు 11 రోజుల పాటు రూ. 500 టికెట్స్ రద్దు చేశారు.. 300 రూపాయలు టికెట్స్, 100 టికెట్స్ అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు.. మొదటి రోజు ఏకంగా 75,000 మంది అమ్మ వారిని దర్శించుకున్నారు.. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సమయం కేటాయించారు.. మధ్యాహ్నం 4 గంటలకు వృద్ధులకు, వికలాంగులకు దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు.. మరోవైపు, క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. వాటర్ బొట్టిల్స్, మజ్జిగ పాకెట్స్, పాలు పంపిణీ చేస్తున్నారు ఆలయ అధికారులు..