Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ’ వర్క్షాప్ పోలీసు వ్యవస్థకు ఎంతో కీలకమని ఆమె అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను 4 శాతం మేర తగ్గించగలిగామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో గంజాయి సాగుపై సమర్థవంతంగా నియంత్రణ సాధించామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడని పేర్కొన్న అనిత.. 2028 నాటికి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని అన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిప్రాయాలను వినే నాయకత్వం ఆయనదని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అనేక మంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసిన అనుభవం సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు.
సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులు చేసే దర్యాప్తు కంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు సోషల్ మీడియాలో చేసే చర్చలు, విచారణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, అసత్య ప్రచారం చేయడం వంటి అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రెండు రోజుల వర్క్షాప్లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. వర్క్షాప్లో పాల్గొంటున్న అధికారులు తమ సలహాలు, సూచనలను నేరుగా ముఖ్యమంత్రికి అందించాలని హోంమంత్రి అనిత కోరారు. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

