VijayaSaiReddy: రాహుల్ యాత్ర కోసం లగ్జరీ కంటైనర్.. వీడియో విడుదల చేసిన విజయసాయిరెడ్డి

Vijayasaireddy

Vijayasaireddy

VijayaSaiReddy: భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌లోని శ్రీనగర్ దాకా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 3,570 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర కోసం సాధారణ కంటైనర్లను ఏర్పాటు చేశామని.. రాహుల్ గాంధీ అందులోనే బస చేస్తారని.. స్టార్ హోటళ్ల లాంటి సౌకర్యాలను వాడుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అయితే రాహుల్ గాంధీ బస చేస్తున్న కంటైనర్ సాధారణమైనది కాదని.. అది లగ్జరీ కంటైనర్ అని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.

Read Also: India Partition: అపూర్వ కలయిక.. 75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో కలుసుకున్న అన్నాచెల్లెలు

రాహుల్ గాంధీ కోసం ఏర్పాటు చేసిన భారీ కంటైన‌ర్‌లో ఏసీ స‌దుపాయం కూడా ఉందని విజయసాయిరెడ్డి తన వీడియోలో వివరించారు. ఈ కంటైనర్‌లో ఓ ప‌డ‌క గ‌ది, దానికి స‌మాంత‌రంగా మ‌రో గ‌ది, స్నానాల గ‌ది కూడా ఉన్నాయి. ఇంట్లో ఎలాంటి వ‌సతులు ఉంటాయో, వాటికి ఏమాత్రం త‌గ్గని రీతిలో వ‌స‌తులు క‌లిగిన ఈ కంటైన‌ర్‌కు చెందిన ఓ వీడియోను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఈ త‌ర‌హా కంటైన‌ర్లు రాహుల్ పాద‌యాత్ర వెంట ఏకంగా 59 కంటైన‌ర్లు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. ఈ కంటైన‌ర్‌కు ల‌గ్జరీ ఆన్ వీల్స్ అంటూ విజయసాయిరెడ్డి నామకరణం చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఖరీదైన టీషర్టులు ధరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.