వినియోగదారులకు టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్ పరధిలో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా ఉంది. అయితే ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటే ప్రజలు జంకుతున్నారు. తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయంలో వ్యాపారులు సిండికేట్ అయ్యి రూ.60కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎండ వేడికి దిగుబడి తగ్గడం, పంట వాడిపోవడంతో టమోటాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని బహిరంగ మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నారు. అటు మదనపల్లి మార్కెట్లోనూ టమోటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి 35 పలకగా, రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆదివారం కిలో టమోటా గరిష్టంగా రూ.55 పలికింది.
