TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. తిరుమల గిరులు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి.. అయితే, అక్కడ ఇబ్బంది పడకుండా ముందే టికెట్లను బుక్ చేసుకుని వెళ్లడం ఎంతో ఉత్తమం.. దర్శన టికెట్లతో పాటు.. వివిధ సేవా టికెట్లను.. అద్దె గదులను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తూ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, అక్టోబర్ నెల ఆన్లైన్ టిక్కెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, నిన్న ఒక్కరోజే 77,874 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,302 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లుగా నమోదైనట్టు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం..

