Real Estate Scam: తిరుమల శ్రీవారి వీవీఐపీ దర్శనాన్ని ఎరగా చూపిస్తూ ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీపీ డెవలపర్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థ ప్రతినిధులు కాల్ సెంటర్ ద్వారా కొనుగోలుదారులను సంప్రదిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందం చేసుకున్నామని, తమ వద్ద ప్లాట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం వీవీఐపీ దర్శనం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక ఫేక్ ఫోన్ నంబర్ వెలుగులోకి రాగా, తాజాగా మరో కొత్త నంబర్ నుంచి కూడా భవిష్యత్ కొనుగోలుదారులకు ఫోన్లు వస్తున్నట్లు బయటపడింది. దీంతో ఈ ప్రచారం వెనుక మరింత పెద్ద మోసపూరిత నెట్వర్క్ పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, శ్రీవారి దర్శనం పేరుతో జరుగుతున్న ఈ ప్రచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి హామీలు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.
అలాగే టీటీడీ పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేక్ రియల్ ఎస్టేట్ సంస్థలు, సైబర్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే “జీవితాంతం వీవీఐపీ దర్శనం”, “టీటీడీతో ప్రత్యేక ఒప్పందం” వంటి ప్రకటనలను నమ్మి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు. భక్తిని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సందేహం వచ్చినా అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు..

