NTV Telugu Site icon

పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ.. ఇంకా అనుమతి రాలే..!

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కదలిన జనసేన పార్టీ.. ఎక్కడికక్కడ శ్రమదానంతో రోడ్లను కొంతమేరకు అయినా బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. తూర్పు గోదావరితో పాటు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగనుంది.. అయితే.. పవన్‌ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్‌, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్‌ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్‌ బాలాజీపేట సెంటర్‌కు బహిరంగ సభను మార్చినట్టు చెబుతున్నారు. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్‌ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. అయితే వేదికను మార్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అధ్వాన్నంగా ఉన్న రాజమండ్రి హుక్కుంపేట – బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్.. అయితే, ఇప్పటి వరకూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. బహిరంగ సభ నిర్వహించేందుకు వీల్లేదని రాజమండ్రి అడిషనల్ ఎస్పీ లతా మాధురి స్పష్టం చేశారు.. కానీ, మరోవైపు.. జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఏర్పాట్లలో మునిగిపోయారు.. బహిరంగ సభ, శ్రమదాన కార్యక్రమానికి ప్రజలు, జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తుండగా.. పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో.. ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.