కోవిడ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి.. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించాయి.. వాళ్లకు ఇరత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. పరీక్షలు వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు రెడీ చేసినట్టు తెలిపారు ఏపీ పాఠశాల విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు.. పదవ తరగతి పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరుకానున్నారని తెలిపిన ఆయన.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని.. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంధి పాల్గొంటారని వెల్లడించారు.
మరోవైపు.. 11 పేపర్ల బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నామన్న ఆయన.. సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు కూడా వెల్లడించేలా ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు.. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందని.. కానీ, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందన్నారు చినవీరభద్రుడు. కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని.. రేపు సిఎం వైఎస్ జగన్.. విద్యా శాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.