AP Assembly: ఎథిక్స్‌ కమిటీ ముందుకు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనలు, మరోవైపు సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇది నడుస్తూనే ఉంది.. అయితే, టీడీపీ సభ్యుల వ్యవహార శైలి ఎథిక్స్ కమిటీ ముందుకు చేరింది.. సభలో టీడీపీ సభ్యుల వ్యవహారాల శైలిని పరిశీలించి.. తగిన చర్యలు సూచించనుంది ఎథిక్స్ కమిటీ.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

Read Also: Ukraine Russia War: మీడియాపై పుతిన్‌ ఆంక్షలు..

కాగా, గత కొద్ది రోజులుగా కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించటం, స్పీకర్ పై కాగితాలు చించి వేయటం, ఈలలు వేయటం, చిడతలు తెచ్చి రభస, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది… ఈ నేపథ్యంలో.. సభ్యుల వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరపనుంది.. అసెంబ్లీకి సంబంధించిన వీడియో ఫూటేజ్‌ను కూడా పరిశీలించనుంది ఎథిక్స్ కమిటీ.. టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని ఎథిక్స్ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని.. రిఫర్ చేయడంతో.. ఎథిక్స్‌ కమిటీ విచారణ, సూచించే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.