ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే వుంటాయి. అందులోనూ విజయనగరంలో పూసపాటి వారి ఇంట రాజకీయాల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. విజయనగరంలో ప్రతి ఏడాది నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి తనను ఆహ్వానించలేదని చెబుతున్నారు మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత.
ఈమేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించారు. ఈ సిరిమానోత్సవం రోజున పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అని అభిలషించారు. మన హృదయం నిర్మలంగా ఉంటే అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
గతేడాది మాన్సాస్ చైర్ పర్సన్ హోదాలో దసరా సిరిమానోత్సవానికి హాజరయ్యారు సంచయిత. అయితే ఈసారి ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల కోర్టు తీర్పుతో సంచయిత మాన్సాస్ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఏటా విజయదశమి తర్వాత వైభవంగా నిర్వహించే సిరిమానోత్సవానికి గజపతిరాజుల వంశీకులు హాజరవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. కానీ సంచయిత తనకు ఆహ్వానం అందలేదంటున్నారు.
