DGP Rajendranath Reddy : నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీగా ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. నాపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థ పైనే ఆరోపణలు వస్తాయని ఆయన అన్నారు. మతాల మధ్య సామరస్యం ఉండాలని, చిన్న పొరపాటు కూడా జరక్కుండా గౌతమ్ సవాంగ్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. టెక్నాలజీని పోలీసు వ్యవస్థకు సమర్ధవంతంగా అందించారని, గౌతమ్ సవాంగ్ సామర్ధ్యాన్ని చూసే ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు.