Site icon NTV Telugu

Kakinada Fire Accident: 20 మంది సజీవ దహనం.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా మృతదేహాలు

Firecracker Factory Blast

Firecracker Factory Blast

Kakinada Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేట్లపాలెంలోని ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 35 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. మంటలు క్షణాల్లోనే యూనిట్ అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు వల్ల భవనం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ యూనిట్‌కు భారీగా బాణసంచా ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు నిర్వాహకులు సాధారణం కంటే ఎక్కువ మంది కార్మికులను పెట్టి పనులు చేయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో రసాయనాలను నిల్వ ఉంచడం లేదా తయారీ సమయంలో జరిగిన అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version