టిడ్కో ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కన్వీనర్ బాబురావు, కార్యకర్తలు.. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 15 వేలకు పైగా గృహాలు నిర్మించి ఇల్లు కేటాయిస్తామని అర్హత పత్రాలిచ్చారన్నారు.
దాదాపు 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు పూర్తి చేసి ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్మాణం చేసిందని కక్షతో పేదల ఇబ్బందులకు గురి చేయటం సరికాదని, తక్షణమే మౌలిక సదుపాయాలు పూర్తిచేసి ఇళ్ళు కేటాయించకపోతే మేమే గృహ ప్రవేశం చేసి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. జగనన్న నివాస కాలనీల్లో నివాస గృహాలు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టాలన్నారు.
