కోవిడ్తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది. ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను ఇక ఆన్లైన్ చేసేందుకు కోవిడ్ 19 పోర్టల్ను తీసుకొచ్చింది. కరోనా వైరస్ (కోవిడ్ – 19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్లైన్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా, సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Read Also:విశాఖలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు…
మొబైల్తోపాటు కంప్యూటర్లోనూ ఆన్లైన్ పోర్టల్లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్ నిర్థారించిన ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
